Vivekam : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి బయోపిక్గా తెరకెక్కిన మూవీ ‘వివేకం’. దీనికి యూట్యూబ్లో మంచి ఆదరణ లభిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఒక్కరోజులోనే 10 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం. సీబీఐ ఛార్జిషీట్లోని అంశాల ఆధారంగా ‘టీమ్ ఎస్ క్యూబ్’ ఈ మూవీని తీసింది. వివేకా హత్య అనంతరం అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల వీడియోను ఈ మూవీలో యథాతథంగా చూపించడం గమనార్హం. ఓవైపు జగన్ పాత్రధారి నోట ఈ డైలాగ్లను పలికిస్తూ.. సమాంతరంగా అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యల ఒరిజనల్ వీడియోను కూడా చూపించారు.
We’re now on WhatsApp. Click to Join
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య ఎలా జరిగింది ? వివేకాపై గొడ్డలివేటు వేయడానికి కుట్ర ఎక్కడ మొదలైంది? ఎవరెవరు అమలుచేశారు? వారి వెనక ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలను ‘వివేకం’(Vivekam) సినిమాలో చూపించారు. సీబీఐ ఛార్జిషీట్లోని అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బాగా ప్రాచుర్యం పొందిన ప్రశ్నతో మొదలుపెట్టి ఈ చిత్రంలో వివేకా హత్యకు దారితీసిన పరిణామాలను చూపించారు.
‘రాయలసీమ ప్రాంతంలో జనం దైవ సమానంగా కొలిచే ఓ రాజు.. ఆయన కడుపున రాక్షసమృగం పుట్టింది. అది అధికారకాంక్షతో రగిలిపోతూ మంచీచెడూ మరిచిపోయి తన మన భేదం లేకుండా మారణహోమాన్ని తలపించే భీకర యుద్ధాన్ని సృష్టించి ఎదగటం ప్రారంభించింది’ అంటూ నేపథ్య వ్యాఖ్యానంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తెరపై చూపిస్తూ ఈ సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత ‘వెల్కమ్ టు పులివెందుల’ అంటూ వైఎస్ వంశవృక్షం ఆధారంగా వారి కుటుంబంలోని ఒక్కో పాత్ర పరిచయమవుతుంది. జగన్మోహన్రెడ్డి సతీమణి భారతికి కడప ఎంపీ అవినాష్రెడ్డి మేనమామ కుమారుడు. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధమే ఈ కథ అని సినిమాలో చూపిస్తారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తొలుత ఆయన గుండెపోటుతో మరణించారని వెల్లడించారు. ఆ తర్వాత గొడ్డలి పోటుకు ప్రాణం పోయిందని స్పష్టమైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్, సీబీఐకి అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ‘వివేకం’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ప్రారంభంలో పేర్కొన్నారు. ‘మేం కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్నాం.. నాయన పేరు మీద’ అని ‘వివేకం’ ట్రైలర్ ప్రారంభంలో డైలాగ్ వినిపించింది. వైఎస్ జగన్ పాత్రధారి డైలాగ్ అన్నమాట. ఆ తర్వాత ‘మీ నాయనకు, నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ’ అని వివేకా స్పష్టం చేస్తారు. ‘పార్టీలోకి రాకపోతే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది’ అని వివేకాకు విజయమ్మ ఎదురు నిలబడటం, ఆ తర్వాత తన కుమారుడికి మద్దతు ఇవ్వమని కోరడం వంటివి చూపించారు.