Site icon HashtagU Telugu

Viveka Murder Case : అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి

Viveka Murder Case Approver

Viveka Murder Case Approver

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case) రెండు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) భార్య షాబానా(Shabana) తాజాగా దాడికి గురయ్యారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్యాల గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లిన షాబానా మీద ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. తమను ఉద్దేశించి తీవ్రంగా బూతులు మాట్లాడుతూ దాడి చేశారని, తన భర్త దస్తగిరిని ఏడాదిలోపు హత్య చేస్తామని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Fact Check: పురావస్తు తవ్వకాల్లో దొరికింది.. ఘటోత్కచుడి ఖడ్గమేనా ?

షాబానా చెప్పిన వివరాల ప్రకారం.. తమపై దాడికి పాల్పడిన మహిళలు జగన్, అవినాష్ రెడ్డిల పేర్లను పదేపదే ప్రస్తావించారని, దస్తగిరి ఎందుకు వారి మీద మాట్లాడుతున్నాడని నిలదీసారని తెలిపారు. ఈ దాడిలో శంషున్, పర్వీన్ అనే మహిళలు ప్రధాన పాత్ర పోషించారని ఆమె ఆరోపించారు. హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, తన భద్రత కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని షాబానా అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వాచ్‌మెన్ రంగన్న అనుమానాస్పద రీతిలో మరణించినప్పటి నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని ఆమె ఆరోపించారు.

Amaravathi : అమరావతికి మరో తీపి కబురు

ఈ ఘటనపై ప్రభుత్వం పోలీస్ శాఖ తక్షణమే స్పందించి దస్తగిరి కుటుంబానికి భద్రత కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒక ముఖ్యమైన హత్య కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తి కుటుంబంపై దాడి జరగడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని షాబానా కోరుతున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని తక్షణమే అరెస్టు చేసి, తమ కుటుంబ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.