Vishnu Kumar Raju వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల తీరుపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇజ్రాయెల్ నుంచి తెచ్చినట్లుగా చెబుతున్న ఒక ‘ఆల్కహాల్ గన్’ను మీడియాకు చూపిస్తూ… జగన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఆయన వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. జగన్ తన సలహాదారుల మాటలు విని తన రాజకీయ స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు.
విచిత్రమైన ఆలోచనలు చేసే సలహాదారుల ప్రభావం వల్లే జగన్ తప్పుదోవ పడుతున్నారు. వారికి కనీస సాధారణ జ్ఞానం ఉందా? అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. జగన్ గతంలో తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా రాజధాని విషయంలో చేసిన ప్రయోగాలు రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు.
అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను గత ప్రభుత్వం అనేక రకాలుగా వేధించిందని, వారిని ఇబ్బందులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై స్పష్టత లేకపోవడం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయాయని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.
అమరావతికి ప్రత్యామ్నాయంగా గతంలో జగన్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన ప్రతిపాదనలపై విష్ణుకుమార్ రాజు ఘాటుగా స్పందించారు. అశాస్త్రీయమైన సలహాలు ఇచ్చే వారిని పక్కన పెట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని హితవు పలికారు.
