వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో తమ సీటు ఉంటుందో పోతుందో అని టెన్షన్ నెలకొంది. గత వారం రోజులుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తన క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకుంటున్నారు. దాదాపుగా 90 శాతం మంది అభ్యర్థులను మారుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చారు. ఇటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా భారీగా అభ్యర్థుల్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు పంపించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో కీలకంగా ఉన్న గన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించినట్లు సమాచారం. ఆయన్ని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దింపేందుకు వైసీపీ పావులు కదుపుతుంది. గతంలో వల్లభనేని వంశీమోహన్ విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేలగా రెండుసార్లె గెలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లారు. వైసీపీలో గన్నవరం ఇంఛార్జ్గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడంతో అక్కడ టీడీపీ మరింత బలపడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తే ఓటమి పక్కా అని వైసీపీ భావిస్తుంది. అందుకోసమే ఆయన్ని తప్పిస్తున్నట్లు సమాచారం. ఇటు వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు సరైన నాయకుడు లేకపోవడం, ఎవరిని అడిగినా తాము పోటీ చేయలేమని అధిష్టానానికి చెప్పడంతో వంశీని ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం భావిస్తుంది. గన్నవరం వైసీపీ అభ్యర్థిగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తుంది. అయితే పార్థసారథి తన సొంత నియోజకవర్గం విడిచి గన్నవరం వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. అభ్యర్థుల్ని మార్పు వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Payyavula Keshav : రైతులను జగన్ సర్కార్ ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే నిరసన ..అరెస్ట్