Tweet War : `సిగ్గులేని జ‌న్మ‌`పై దుమారం!

'జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ` అంటూ తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంది.

  • Written By:
  • Updated On - June 24, 2022 / 10:22 AM IST

‘జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ` అంటూ తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. బూతులు, అస‌భ్య వ్యాఖ్య‌ల‌కు దూరంగా ఉండే లోకేష్ ఇటీవ‌ల మాట తూలుతున్నారు. అదేమంటే, ఎదుటి వాళ్లు ఉప‌యోగించిన ప‌దాల‌కు ధీటుగా స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న‌కు ప్ర‌త్యేక ట్రైనింగ్ బెంగుళూరు బ్యాచ్ ఇస్తోంద‌ట‌. `వైసీపీ కుక్క‌లు, జ‌గ‌న్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగం, ఒరై జ‌గ‌న్ రెడ్డి.. ఇలాంటి ప‌దాలు వాడేసినా మాస్ లీడ‌ర్ గా ఇంకా లోకేష్ పూర్తి స్థాయికి ఎద‌గ‌లేద‌ని ట్రైన‌ర్లు భావిస్తున్నార‌ట‌. అందుకే, తాజాగా `జ‌గ‌న్ రెడ్డిది సిగ్గులేని జ‌న్మ‌` అంటూ ట్వీట్ట‌ర్లో పోస్ట్ పెట్టారు.

ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం జగన్ కు వ్యసనంగా మారిందని ట్విట్ట‌ర్లో ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు, ఏపీని ఎల‌క్ట్రానిక్ హ‌బ్ గా మార్చేస్తున్నామ‌ని ప‌లు కంపెనీల‌తో వైసీపీ ప్ర‌చారం చేసుకుంటోన్న పోస్ట‌ర్ ను కూడా ట్విట్ట‌ర్లో జ‌త చేశారు. ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ కూడా జగన్ తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి` అంటూ ట్విట్ట‌ర్లోని సారంశం. దానికి `జ‌గ‌న్ రెడ్డిది సిగ్గులేని జ‌న్మ‌` అంటూ ప‌దాన్ని జోడించ‌డం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

సాధార‌ణంగా చంద్ర‌బాబు త‌ర‌హాలోనే నారా లోకేష్ కూడా బూతు మాట‌లు ఉప‌యోగించ‌రు. తెలుగును పాలిష్ గా మాట్లాడేందుకు ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు లోకేష్‌. క్యాడ‌ర్ ను ఉత్సాహ‌ప‌రిచేలా ఎప్ప‌టిక‌ప్పుడు ఎలాంటి ప‌దాల‌ను ఉప‌యోగించాలి? స్పీచ్ లో వాడాల్సిన అంశాలు త‌దిత‌రాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు ఒక టీమ్ ప‌నిచేస్తుంటుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ టీమ్ ఇటీవ‌ల లోకేష్ ను మాస్ లీడ‌ర్ గా ఫోక‌స్ చేయ‌డంలో స‌క్సెస్ అయింద‌ని ఆ పార్టీలోని కొంద‌రు భావిస్తున్నారు. అదే త‌రుణంలో వైసీపీ లీడ‌ర్లు వాడే ప‌ద‌జాలానికి అనుగుణంగా వ్యాఖ్య‌ల‌ను జోడించ‌డం కూడా త‌ర్ఫీదు నివ్వడానికి సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అందుకే, ఎప్పుడూ మాట తూల‌ని లోకేష్ ఇటీవ‌ల కొన్ని ప‌దాల‌ను అనివార్యంగా వాడేస్తున్నారు.

`జ‌న్మ` గురించి ఇప్పుడు లోకేష్ ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డిని ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశారో, అదే విధమైన వ్యాఖ్య‌ల‌ను ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబుపైన మాజీ సీఎం. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వాడారు. `నీ అమ్మ‌కు ఎందుకు పుట్టావో.. అంటూ అసెంబ్లీలో ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ వాడిన ప‌ద‌జాలం గంద‌ర‌గోళాన్ని రేపింది. అమ్మ‌ను కించ‌ప‌రుస్తూ వైఎస్ మాట్లాడాడ‌ని అసెంబ్లీని అప్ప‌ట్లో టీడీపీ స్థంభింప చేసింది. స్వ‌ర్గీయ రోశ‌య్య జోక్యం చేసుకోవ‌డంతో ఆ వివాదానికి అసెంబ్లీలోనే తెర‌ప‌డింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి జ‌న్మ గురించి లోకేష్ ట్వీట్ చేయ‌డం పెద్ద దుమారాన్ని రేపుతోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన జ‌న్మ సంబంధ వ్యాఖ్య‌లు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.