నెల్లూరు (Nellore) ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై శనివారం రాత్రి ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురిని రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి (Three Died) చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా, ఒక మహిళ మృతి చెందారు. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న నరసపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతి చెందారు.వీరు రైలు పట్టాలు దాటుతుండగా ఎదురుగా వస్తున్న రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుండగా మరొకరు మాత్రం విభిన్నంగా చెబుతున్నారు. వీరి వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్య కోణంలో కూడా రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Central Govt: ట్విటర్, యూట్యూబ్లకు..కేంద్రం సంచలన ఆదేశాలు!
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పొలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాద స్థలంలో మృతిచెందిన వారి బ్యాగులు లభించాయి. ఓ బ్యాగ్ లో విజయవాడ కార్పొరేషన్ కు చెందిన వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ తెన్నేటి సరస్వతీరావు పేరుతో ఐడీ కార్డును గుర్తించారు. దీంతో మృతుల్లో ఒకరు సరస్వతీరావు అయివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్పై ఉన్న మహిళను రక్షించే క్రమంలో పురుషులు కూడా ప్రమాదంలో పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారా..? లేదా అని తెలియాల్సి ఉంది.