Site icon HashtagU Telugu

TTD : తిరుమల శ్రీవాణి దాతల దర్శనానికి కొత్త షెడ్యూల్ అమల్లోకి

TTD

TTD

TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు శ్రీవాణి దాతలు టికెట్ తీసుకున్న తర్వాత, దాదాపు మూడు రోజుల తరువాతే దర్శనం చేసే అవకాశముండేది. అయితే భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు ఆ విధానంలో మార్పులు తీసుకొస్తున్నారు. తాజా మార్పుల ప్రకారం, ఆగస్టు 1 నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా అమలులోకి రానున్న ఈ కొత్త విధానంలో, భక్తులు ఆఫ్‌లైన్ టికెట్లు పొందిన అదే రోజునే శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కలగనుంది.

ఈ మార్పులకు సంబంధించిన సమీక్షా సమావేశం బుధవారం తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో నిర్వహించబడింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నేతృత్వంలో నిర్వహించిన ఈ సమీక్షలో, కొత్త విధానం అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులు ఉదయం 10 గంటల నుంచి తిరుమలలోని అన్నమయ్య భవనం ఎదుట టికెట్ల కోసం ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది. “మొదట వచ్చిన వారికి మొదట” అనే పద్ధతిలో రోజుకు 800 టికెట్లు జారీ చేయనున్నారు. అదేవిధంగా రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచి 200 టికెట్ల వరకు అందుబాటులో ఉండనున్నాయి.

India Post : తపాలా శాఖ కీలక నిర్ణయం.. రిజిస్టర్డ్‌ పోస్టు స్థానంలో స్పీడ్‌ పోస్టు విధానం..

ఈ టికెట్లతో భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద రిపోర్ట్ అవ్వాలి. ఇదే సమయంలో శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇదే సమయంలో, ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు అక్టోబర్ 31 వరకు ఉదయం 10 గంటల సమయంలో దర్శన అనుమతి ఉంటుంది. నవంబర్ 1 నుంచి ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ టికెట్లతో వచ్చిన భక్తులందరికీ సాయంత్రం 4:30గంటల సమయంలో దర్శనం కల్పించనున్నారు.

ఈ విధానం ద్వారా భక్తులు తాము తిరుమల చేరిన రోజునే దర్శనం పూర్తి చేసుకునే వీలుంటుంది. భక్తులు తిరుమల చేరిన వెంటనే ఉదయం 10 గంటలకే టికెట్ జారీ కేంద్రాల వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచిస్తోంది. ఇది దర్శన సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొంది.

Poha : అటుకుల్లో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే ఎవ్వరు వదిలిపెట్టారు !!

Exit mobile version