ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతలను మెరుగుపరచడం, పోలీస్ వ్యవస్థను అధునీకరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రిని పోలీస్ కమిషనరేట్లుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుదల, నగరాల విస్తరణ, నేరాల నియంత్రణ కోసం వీలుగా కొత్త కమిషనరేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు పోలీస్ కమిషనరేట్లను అప్గ్రేడ్ చేయడం ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూడు కొత్త కమిషనరేట్ల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ప్రతిపాదించిన ఈ మూడు కమిషనరేట్లకు సంబంధించిన సరిహద్దులు, మౌలిక వసతులపై ఫోకస్ పెట్టాలని తిరుపతి, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. కమిషనరేట్ల పరిధిలోకి వచ్చే కొత్త పోలీస్ వింగ్స్, అదనపు సిబ్బంది అవసరాలు, ఇతర సాంకేతిక వసతులపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఓకే చెప్పడంతో నగరాల్లో ట్రాఫిక్, క్రైమ్ కంట్రోల్ వంటి విభాగాలు మరింత బలోపేతం అవుతాయని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.
మరోవైపు రాష్ట్రంలో ముగ్గురు అడిషనల్ ఎస్పీలకు నాన్-క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి లభించింది. గ్రేహౌండ్స్లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న ఎం. చిదానందరెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అడిషనల్ ఎస్పీ కె. నాగేశ్వరరావు, గుంటూరు క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ ఎస్పీ కె. సుప్రజకు నాన్-క్యాడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు దక్కాయి. ఈ ముగ్గురిని తదుపరి పోస్టింగుల కోసం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ప్రమోషన్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురికి త్వరలోనే పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
