Thota Trimurtulu : శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు షాక్ తగిలింది. ఆయనకు విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు 18 నెలల జైలు శిక్ష , రూ.2 లక్షల జరిమానా విధించింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయ పాలెంలో జరిగిన ఓ అమానుష ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటనలో తోట త్రిమూర్తులను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో త్రిమూర్తులతో పాటు నిందితులుగా ఉన్న మరో తొమ్మిది మందికి కూడా శిక్ష విధించారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా, ఈ సుదీర్ఘ వ్యవధిలో 148 సార్లు విచారణ వాయిదా పడింది. మనదేశంలో న్యాయవిచారణ ఎంత నెమ్మదిగా జరుగుతుంది అనే దానికి ఈ కేసు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం తోట త్రిమూర్తులు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీగా, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
పోలీసు కేసుకు సంబంధించిన నివేదిక ప్రకారం.. 1996 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు(Thota Trimurtulu) ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. ఐదుగుర్ని హింసించారు. అప్పట్లో ఈ సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కోర్టుల విచారణకు తరుచుగా హాజరవుతూనే ఉన్నారు. గత ఏడేళ్లుగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది.
వాస్తవానికి దీనికి సంబంధించిన తుది తీర్పు 2018లోనే రావాల్సి ఉంది. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. అప్పట్లోగా ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు బాధితులు ఎస్సీలు కాదని ఫిర్యాదులు ఇప్పించి వారికి పత్రాలు అందకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి హైకోర్టు కలుగజేసుకొని.. వారికి కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేయాలని ఆదేశించింది. అన్ని విచారణలు పూర్తవడంతో.. తోట త్రిమూర్తులు తప్పు చేశాడని నిర్ధారించి కోర్టు ఇప్పుడు శిక్ష విధించింది. ప్రధాన సాక్షి కోటి రాజు కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన బాధితులు ఐదుగురిలో ఇద్దరు ఇప్పటికే మరణించారు. చనిపోయాక వారికి న్యాయం జరగడం బాధాకరం. 15 మంది సాక్షుల్లోనూ ఇద్దరు చనిపోయారు.