TDP vs JanaSena అధికార కూటమి ఘనవిజయం సాధించిన కొన్ని రోజులకే పిఠాపురంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఒక ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, ఇటీవలే జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. దొరబాబు ఒక వైసీపీ కోవర్టు అని, కూటమిలో గొడవలు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని వర్మ తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వర్మ, ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించినందుకు తనపైనా, టీడీపీ కార్యకర్తలపైనా దొరబాబు దాడి చేసి, అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎన్నికల సమయంలో కూటమికి వెన్నుపోటు పొడిచి, పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు, ఇప్పుడు కూటమిలోకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తున్నారు. ఆయన వైసీపీ కోవర్టుగా పనిచేస్తూ కూటమిలో తగాదాలు సృష్టిస్తున్నారు” అని వర్మ ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఫోటో లేదని ప్రశ్నించినందుకు నాపై, మా టిడిపి కార్యకర్తలపై దాడి చేసి అనరాని మాటలు అంటారా? పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు ఈరోజు కూటమిలోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నాడు! వైసిపి కోవర్టుగా దొరబాబు పనిచేస్తూ కూటమిలో తగాదాలు… pic.twitter.com/4nxMg9659W
— SVSN Varma (@SVSN_Varma) April 22, 2026
ముఖ్యమంత్రి చంద్రబాబుకు గానీ, తామంతా కలిసి గెలిపించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు గానీ అవమానం జరిగితే సహించే ప్రసక్తే లేదని వర్మ హెచ్చరించారు. ఫ్లెక్సీ వివాదంపై పాడా కమిషనర్ పొరపాటు జరిగిందని చెప్పడంతో సమస్య సద్దుమణిగిందని, కానీ ఆ తర్వాత దొరబాబు కల్పించుకుని తనను నెట్టేసి వివాదాన్ని పెద్దది చేశారని వివరించారు. కూటమి ధర్మం పాటిస్తూ, చంద్రబాబు వంటి క్రమశిక్షణ గల నేత వద్ద పెరిగినందునే తాము సంయమనంతో ఉన్నామని తెలిపారు.
అంతటితో ఆగకుండా, “దొరబాబు చేసిన స్కామ్లన్నీ నేను బయటపెడతాను. ఆ స్కామ్లు బయటపడకుండా ఉండేందుకే ఆయన పార్టీ మారారు” అని వర్మ ఆరోపించారు. మరోవైపు వర్మ చీకటి బాగోతాలు తాను బయటపెడతానంటూ దొరబాబు కూడా కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కూటమి నేతల మధ్య ఈ స్థాయిలో బహిరంగ విమర్శలు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
