TDP : పెన్షన్ల పెంపు హామీపై సీఎం జగన్ రెడ్డి మడత పేచీ.. ఎన్నికల ముందు మరో మోసానికి ప్రయత్నచేస్తున్నాంటూ అచ్చెన్న ఆగ్ర‌హం

పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 08:43 AM IST

పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి పెన్షన్లు రూ.3వేలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏటా రూ.250 చొప్పున పెంపు అంటూ హామీపై మడమ తిప్పారన్నారు. ఆ మాట ప్రకారం పెంచినా 2022 నాటికే రూ.3వేల పెన్షన్ ఇవ్వాలని.. కానీ ఇప్పుడు ఎన్నికలకు మరో మూడు నెలల కాలం ఉందనగా రూ.3వేలు చేస్తున్నామంటూ, కేబినెట్లో ఆమోదిస్తున్నామంటూ హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు. రూ.3వేల హామీపై మడమ తిప్పి ఒక్కో పెన్షన్ దారుడికి జగన్ రెడ్డి దాదాపు రూ.32 వేల వరకు ఎగనామం పెట్టార‌ని.. ఇదేనా పేదలపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఉన్న చిత్త‌శుద్ధి అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగుదేశం ప్రభుత్వ సగటు ఏడాది బడ్జెట్ రూ.1.41 లక్షల కోట్లు మాత్రమే అయినప్పటికీ రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేశామ‌ని.. ఐదేళ్లలో రూ.1,800 పెంచామ‌న్నారు. 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామ‌ని.. వృత్తి కార్మికులకు కొత్తగా పెన్షన్లు, ట్రాన్స్ జెండర్లకు పెన్షన్లిచ్చామ‌న్నారు. జగన్ రెడ్డికి సగటు ఏడాది బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉన్నప్పటికీ ఐదేళ్లలో పెంచిన పెన్షన్ మొత్తం కేవలం రూ.750 మాత్రమేన‌న్నారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లూ అంతంత మాత్రమేన‌ని… మరోవైపు ట్రాన్స్ జెండర్స్, బ్రాహ్మణ పెన్షన్లు రద్దు చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నోటీసులు పంపిన నీచపు చరిత్ర జగన్ రెడ్డిది మాత్రమేన‌న్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే.. మొదటి ఏడాది నుండే రూ.3వేల చొప్పున పెన్షన్ అందేదని..ఎల్లకాలం ప్రజల్ని మాటలతో మాయం చేయడం సాధ్యం కాదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.

Also Read:  TDP vs YSRCP : సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఉండ‌వ‌ల్లి, మేక‌పాటి