కుటుంబ సారథులను (TDP Poll Management) టీడీపీ తయారు చేస్తోంది. కరుడుకట్టిన టీడీపీ కార్యకర్తలను సారథులుగా నియమిస్తోంది. ప్రతి 60 కుటుంబాలకు ఇద్దర్ని బాధ్యులను చేయాలని భావిస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు మహిళ ఉండేలా చూస్తోంది. రాబోవు ఎన్నికల్లో కుటుంబ సారథులు కీలకం కావాలని సూచిస్తోంది. ఆ మేరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి టీడీపీ ఏర్పాట్లను చేస్తోంది. ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని మార్గదర్శకాలను రూపొందించింది. కుటుంబ, వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక తదితర సమస్యలు ఏవైనా వినడానికి కుటుంబ సారథి సిద్ధంగా ఉండాలని చెబుతోంది. వీలున్నంత వరకు అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే మార్గాన్ని అన్వేషించాలని టీడీపీ దిశానిర్దేశం చేస్తోంది.
నెలాఖరునాటికి కుటుంబ సారథుల ఎంపిక పూర్తి కావాలని నియోజకవర్గ ఇంచార్జిలకు టార్గెట్ పెట్టారు. ఆ తరువాత జిల్లా కేంద్రాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అక్కడ శిక్షణ తరువాత టీడీపీ కేంద్ర కార్యాలయంలో మానవ వనరుల అభివృద్ధి విభాగం ప్రత్యేక శిక్షణ మూడు రోజుల పాటు ఇవ్వనుంది. ఆ మేరకు ప్రణాళికను రచించిన టీడీపీ వీలున్నంత వరకు కుటుంబ సారథులుగా (TDP Poll Management) 40 ఏళ్ల లోపు వాళ్లను ఎంపిక చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వైసీపీకి పనిచేస్తోన్న వలంటీర్ల వ్యవస్థకు సమాంతరం టీడీపీ కుటుంబం సారథులు పనిచేసేలా ప్లాన్ చేస్తోంది. గతంలో జన్మభూమి కమిటీలకు భిన్నంగా పనిచేసేలా దిశానిర్దేశం చేయనుంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభ్యుల హవా నడిచింది. ప్రభుత్వ పరంగా సమాంతర వ్యవస్థను నడిపారని ఆరోపణలు వినిపించేవి. నీరు-చెట్టు, పనికి ఆహర పథకం తదితరాలను జన్మభూమి కమిటీలు ఎక్కువగా చేసేవి. అంతేకాదు, ఇసుక రీచ్ లను కూడా అప్పట్లో ఆ కమిటీ సభ్యులు నిర్వహించే వాళ్లు. కళ్లెదుట వాళ్లు వ్యవహరిస్తోన్న తీరుపై అప్పట్లో ప్రజలు ఆగ్రహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జన్మభూమి కమిటీల మీద ఆరోపణలు చేసిన దాఖలాలు లేకపోలేదు. ప్రత్యేకించి జేసీ దివాకర్ రెడ్డి పలుమార్లు నేరుగా చంద్రబాబు జన్మభూమి కమిటీల మీద ఫిర్యాదు చేశారు. వాటిని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. లేదంటే, ప్రభుత్వం అభాసుపాలవుతుందని బహిరంగ సభల్లోనూ హెచ్చరించారు. అందుకే, ఇప్పుడు సేవాతత్పరత ఉన్న వాళ్లను మాత్రమే కుటుంబం సారథులుగా (TDP Poll Management) ఎంపిక చేయాలని స్పష్టమైన సంకేతాలను టీడీపీ అధిష్టానం ఇచ్చిందని తెలుస్తోంది.
Also Read : CBN-NTR : చంద్రబాబు సమేత నందమూరి ఫ్యామిలీ! రాష్ట్రపతి భవన్లో ఈనెల 28న సందడి!!
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కొన్ని లక్షల ఓట్లను తొలగించారు. తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ మేరకు రివ్యూను కొనసాగిస్తున్నారు. తొలుత అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై అక్కడి టీడీపీ ఇంచార్జి పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మాజీ మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు తన నియోజకవర్గంలో జరిగిన ఓట్ల తొలగింపును గుర్తిస్తూ ఆధారాలను బయట పెట్టారు. అలాగే, విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా జరిగిన అక్రమాలను టీడీపీ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లక్షలాది మంది ఓటర్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయడానికి ఈనెల 28న ఢిల్లీ వెళుతున్నారు.
Also Read : CBN Achievement : చంద్రబాబు తుఫాన్! TDPలోకి బాలినేని?
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను రివ్యూ చేస్తోంది. భవిష్యత్ లో మళ్లీ ఓట్లను తొలగించకుండా ఉండేందుకు కాపలాగా కుటుంబ సారథులు ఉండాలని టీడీపీ సూచిస్తోంది. వివిధ రకాల సేవలు అందించడానికి ఉన్నప్పటికీ ప్రధానంగా ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించడం, పోలింగ్ రోజు వరకు వాళ్లను కేంద్రానికి తీసుకురావడం తదితర ప్రధానమైన విధులను అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున పనిచేస్తోన్న వలంటీర్లు, ఎన్నికల కోసం నియమించిన గృహసారథులకు సమాంతరంగా కుటుంబ సారథులను టీడీపీ నియమిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కుటుంబ సారథుల నియామకం జరుగుతోంది.