ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ డిజీ సునీల్ కుమార్ ను ఆ పోస్టు నుంచి వెంటనే తొలగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఐడీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సీఐడీ విభాగాన్ని జగన్ జేబు సంస్థగా మార్చి రాజకీయ వేధింపులకు, దాడులకు వాడుతున్న సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై సీఐడీ ప్రకటన అబద్దాల పుట్ట అని చంద్రబాబు ఆరోపించారు. ఎయిర్పోర్ట్లో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం దొరికింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దానిపై సోషల్ మీడియా పోస్టును పార్వర్డ్ చేస్తే రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబును అరెస్టు చేస్తే.. అది అక్రమం అని కోర్టు చెప్పినా…ఇప్పుడు అదే కేసులో నరేంద్రను అరెస్టు చేయడం నిబంధనలు ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. 41 ఏ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఐడీ కస్టడీలో నరేంద్రను దారుణంగా హింసించారని…ఇంత దారుణాలకు ఒడికడుతున్న అధికారులు రేపు అనేది ఉంటుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. నరేంద్రను టార్చర్ పెట్టిన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని చంద్రబాబు హెచ్చరించారు.