చంద్రబాబునాయుడిని పవన్ కల్యాణ్ కలిస్తే దానిపై ముఖ్యమంత్రి స్పందించడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. జగన్ ములాఖత్ లో మిలాఖత్ అంటూ మాట్లాడటం చూస్తే ఆయనకు ఆలోచనా శక్తి తగ్గిందనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి గతం గుర్తుచేసుకోవాలని.. ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు ఎన్ని మిలాఖత్ లు అయ్యాయో గుర్తు చేసుకోవాలన్నారు. వైసీపీ పుట్టుక మొదలైందే ములాఖత్ లు.. మిలాఖత్ లతో కదా! అని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఆ విషయం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. జగన్ ఢిల్లీ వెళ్లి ఎవరితో ఎప్పుడు ములాఖత్ అయ్యి.. మిలాఖత్ లు జరుపుతున్నారో తెలియదా? ఆయనపై ఉన్న కేసుల విచారణ ఆగిపోవ డానికి ఏ ములాఖత్ లు.. ఏ మిలాఖత్ లు కారణమో ఆయనే చెప్పాలన్నారు.
అధికారపార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి, బహిరంగసభకు తేడా తెలియకపోతే ఎలా? వారు మాట్లాడే దానికంటే మేం గట్టిగానే పాయింట్లు మాట్లాడగలమని.. కానీ సమయం … సందర్భం చూస్తున్నామన్నారుఉ. వీళ్లెన్ని చెప్పినా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎక్కడా రూపాయి కూడా పక్కకు పోలేదని..పక్కకు పోనప్పుడు అది చంద్రబాబుకో, మరొకరికో వచ్చే అవకాశమే లేదు. ఫలానా రూపాయి .. ఫలానా దగ్గరకు పోయి.. ఫలానా చోటకు చేరిందని ఈ రోజుకి నిరూపించలేకపోయారని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఎవరైనా ఆధారాలుంటే అరెస్ట్ చేస్తారు… కానీ అరెస్ట్ చేశాక ఆధారాలు చూపిస్తామని నిస్సిగ్గుగా కోర్టులకు చెప్పడం వీళ్లకే చెల్లిందన్నారు.