TDP : ఎన్నికల వేళ ఏ రాష్ట్రంలోనైనా అన్ని పార్టీలకు రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఇటువంటి రెబల్స్ విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి పోటీకి దిగిన ఆరుగురు టీడీపీ(TDP) నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయా అభ్యర్థులు టీడీపీ అధిష్టానం ఎంత చెప్పినా.. నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో ఈమేరకు చంద్రబాబు నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రూల్స్కు విరుద్ధంగా నడుచుకున్నందు వల్లే వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల్లో రెబల్స్గా బరిలోకి దిగి సస్పెండ్ అయిన టీడీపీ నేతల జాబితాలో.. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాంసుందర్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్ ఉన్నారు. ఈవివరాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. నామినేషన్లను ఉపసంహరించుకోకుండా రెబల్స్గా బరిలో నిలిచినందున వారిపై పార్టీపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఏపీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని నియమిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎన్నికల సమన్వయకర్తగా బైరెడ్డి రాజశేఖర్రెడ్డిని నియమించింది. మంత్రాలయానికి పాలకుర్తి తిక్కారెడ్డి, వెంకటగిరికి వూకా విజయ్కుమార్, మదనపల్లికి చమర్తి సురేష్రాజు, మడకశిరకు గుండుమల తిప్పేస్వామి, రంపచోడవరానికి వంతల రాజేశ్వరి, ప్రొద్దుటూరుకు చదిపిరాళ్ల శివనాథరెడ్డి, పుంగనూరుకు మన్నె సుబ్బారెడ్డి, నంద్యాలకు ఏరాసు ప్రతాపరెడ్డి, మార్కాపురానికి మాగుంట రాఘవరెడ్డి, పాడేరుకు బుద్దా నాగజగదీష్, పాణ్యంకు మల్లెల రాజశేఖర్, రాప్తాడుకు గోనుగుంట్ల విజయ్కుమార్లను ఎన్నికల సమన్వయకర్తలుగా నియమించారు. చీపురుపల్లికి గద్దె బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజును, రాజంపేటకు జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి, చమర్తి జగన్మోహన్రాజు, పోలి సుబ్బారెడ్డిని సమన్వయకర్తలుగా నియమించారు.