ఏపీ వరదల్లో `విలీనం` అంశం రాజకీయాన్ని సంతరించుకుంది. ఎడపాక మండల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే, ఆ ప్రాంతం ప్రజలు ఏపీ ప్రభుత్వంపై ఎంత విసుగొత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు వరద ప్రాంతాల సందర్శనకు వెళ్లిన సందర్భంగా అన్నారు. ప్రస్తుతం కరెంట్, మంచినీళ్లు, ఆహారం అందక పోలవరం ముంపు గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడి పరిస్థితిని చూసిన చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ `విలీనం` మాటను ప్రస్తావించారు.
పోలవరం నిర్మాణం కోసం ముంపు ప్రాంతాలుగా గుర్తించిన ఏడు మండలాలను ఉమ్మడి రాష్ట్రం బిల్లులో లేకపోయినప్పటికీ ఏడు మండలాలు విలీనం చేయడం జరిగింది. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, కేంద్ర మంత్రిగా వెంకయ్య చేసిన ప్రయత్నం ఢిల్లీలో ఫలించింది. పునరావాస ప్యాకేజికి అనువుగా ఉండేలా ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కొన్ని గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఆ మేరకు పంచాయతీ తీర్మానాలను కూడా చేయడం గమనార్హం.
Also Read : AP: కార్మికులకు ఏపీ సర్కార్ తీపికబురు… భారీగా వేతనాల పెంపు..!
2014 రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీలో కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం (పట్టణం మినహా) మండలాలను కలిపారు. ఆ రోజు నుంచి పునవాసం ,అభివృద్ధి, సంక్షేమ పథకాలు, భూముల రిజిస్ట్రేషన్ తదితర అంశాల విషయంలో సరిహద్దు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వచ్చిన వరదల కారణంగా ఆ ఏడు మండలాలోని గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. వరదల ఉధృతి తగ్గిపోయి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ జగన్ సర్కార్ నిర్లక్ష్యం వహించింది. ఆ విషయాన్ని చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి చెబుతున్నారు.
Also Read : Amaravathi: 2024 వైసీపీ అస్త్రం 3 రాజధానులు!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాటలకు బలం చేకూరేలా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఏపీలో కలిపిన మండలాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం నిర్మాణం కారణంగా తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు మునిగిపోతున్నాయని వరదలు వచ్చిన తొలి రోజు నుంచే మొదలు పెట్టారు. దానిపై అధ్యయనం చేయడానికి హైదరాబాద్ ఐఐటీ స్కాలర్స్ తో కూడిన ఒక కమిటీని వేశారు. భద్రాచలం ముంపునకు, పోలవరంకు ఎలాంటి సంబంధంలేదని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ `విలీనం` అంశాన్ని మాత్రం తెలంగాణ మంత్రులు వదలడంలేదు.
Also Read : YV Subbareddy: విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!
ఏపీ మంత్రులు ఏకంగా అందరం కలిసుందాం అంటూ `విలీనం`కు సై అంటున్నారు. పలు సందర్భాల్లో మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేద్దమంటూ నేతలు కామెంట్స్ చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలకు ప్రతిగా ఏపీని తెలంగాణలో విలీనం చేద్దామంటూ మంత్రి బొత్సా కామెంట్స్ చేయడం మరోసారి విలీనం అనే అంశం చర్చనీయాంశం అయింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల్లోని మంత్రుల పరస్పర కామెంట్స్ మధ్యలో ఇప్పుడు చంద్రబాబు `విలీనం` అంశాన్ని సీరియస్ గా ప్రస్తావించారు. వరదల్లో చిక్కుకున్న ఎడపాక మండల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారంటే, జగన్ సర్కార్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలని ఆయన విమర్శించడం గమనార్హం.
Also Read : Polavaram Issue: పోలవరం ఆలస్యానికి అసలు కారణమిదే!
ఎడపాక మండల ప్రజలు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రస్తావిస్తుంటే ఏకంగా ఏపీని విలీనం చేయాలని ఆ రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. అంటే, ఏపీ ప్రజలు కూడా జగన్ పాలనపై విసుగు చెందారని టీడీపీ భావిస్తోంది. అందుకే, సాక్షాత్తు మంత్రులే ఏపీని తెలంగాణలో విలీనం చేద్దామంటూ వ్యాఖ్యానిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద విలీనం అంశం ఏపీ వరద రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.