ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమైయ్యాయి.ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) పాలనలో అసాధారణ ధరల పెరుగుదల నుంచి సామాన్యులకు ఎలాంటి ఉపశమనం లభించడం లేదని విమర్శిస్తూ ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని…కాబట్టి ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
Also Read : భక్తులు సంతృప్తి చెందేలా టీటీడీ గదుల నిర్వహణ
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దుర్భర జీవితాలు గడుపుతున్నారని విచారం వ్యక్తం చేస్తూ చెత్తపై పన్ను వసూలు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నాయుడు డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రం ఒక్క ఏపీ మాత్రమేనని ఆరోపించారు. ఈ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యేలు కె. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, రోడ్ల నిర్వహణ, రైతులకు గిట్టుబాటు ధరలు తదితర అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతూ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకున్నారు.
Also Read : అమరావతికి ఏపీ బీజేపీ అండ..21న రైతులతో నేతల పాదయాత్ర
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై అధికార పార్టీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. డ్రగ్స్, మైనింగ్ మాఫియాపై టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ శాసనసభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అధికార వైఎస్సార్సీపీ అస్తవ్యస్త, అరాచక విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.