Aarogyasri : ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) వెల్లడించింది. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో మంగళవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని బుధవారం నుంచి నిలిపివేయనున్నట్లు ఆశా ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join
గత ఆగస్టు నుంచి ‘ఆశా’కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్(Aarogyasri) దాదాపు రూ.1500 కోట్లు బకాయి పడింది. ఈ బిల్లుల చెల్లింపు ఆగిపోయినందు వల్లే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ చెబుతున్నప్పటికీ.. ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవడం లేదని ‘ఆశా’ ఆరోపించింది. గతంలోనూ సీఈఓ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ‘ఆశా’ ప్రతినిధులు తెలిపారు. ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై.రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ స్పష్టం చేశారు.
ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీస్ అసోసియేషన్ తెలిపింది. ‘‘గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులను చెల్లించలేదు. బకాయిలు చెల్లించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలు అందించబోం. మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి వైద్యాన్ని అందిస్తాం. వ్యాధి నిర్థారణ పరీక్షల్లో 50% రాయితీ ఇస్తాం. సర్జరీలు ఉచితంగా చేస్తాం. ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తాం’’ అని వెల్లడించింది.
ఎన్నికలకు దాదాపు ఐదారు నెలల ముందు నుంచే ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోని ఆస్పత్రులు బిల్లులు, ప్యాకేజీల రేట్ల పెంపు కోసం ఆందోళనలను మొదలుపెట్టాయి. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఈ ప్రభుత్వంలో పైసా రాదని డిసైడయ్యారేమో కానీ.. ఎన్నికలయ్యే వరకూ మారు మాట్లాడలేదు. ఎన్నికలు ముగిసి ఫలితాల టైం సమీపించిన ప్రస్తుత తరుణంలో బిల్లుల కోసం యాక్షన్ ప్లాన్ను అమల్లోకి తెచ్చారు. కౌంటింగ్ అయిన తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వమైనా పాత బిల్లుల బకాయిలు చెల్లిస్తుందని ఆస్పత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.