తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, అయినా వైసీపీని వీడేది లేదని నటుడు అలీ స్పష్టం చేశారు. అలీ వైసీపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వైసీపీలో చేరింది పదవుల కోసం కాదని, జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే వైసీపీలో చేరానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానం ముఖ్యమని అలీ అన్నారు. అయితే నాలుగైదు రోజులుగా వైసీపీ నాయకుడైన అలీ పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో అలీ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నాడు. ఇటీవల కమెడియన్ ప్రుధ్వీరాజ్ జనసేన తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
నటుడు అలీ (Ali) వైసీపీలో చేరిన తర్వాత ఆయనను రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణలో భాగంగా అది కుదరలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ముచ్చట తీరలేదు. తీరా.. అలీని రాజ్యసభ (Rajya Sabha)కు పంపడం ఖాయమని వైసీపీ శిబిరం ప్రచారం చేసింది. అక్కడ కూడా ఆయనకు మొండిచేయి ఎదురైంది. ఏపీ నుంచి నలుగురిని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తీరా చూస్తే ఈ లిస్టులో అలీ లేరు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. తాను రాజ్యసభ సీటును ఆశించలేదని అలీ వెల్లడించారు.