Site icon HashtagU Telugu

AP Ministers: మంత్రులకు పదవీ గండం, ఎన్నికల్లో టిక్కెట్ కష్టమే?

Roja Usha

Roja Usha

మరోసారి మంత్రివర్గం విస్తరణ ఉంటుందని ఇటీవల సీఎం జగన్మోహనరెడ్డి సంకేతాలు ఇచ్చిన మేరకు త్వరలోనే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంది. ఆ మేరకు తాడేపల్లి వర్గాల్లోని టాక్. ఇలా అయితే పార్టీ లో ఉండలేమని మంత్రి రోజా మాట్లాడిన ఆడియో గత వారం వైరల్ అయింది. ఆమెకు సొంత పార్టీలో చాలా వ్యతిరేకత ఉంది. పైగా విశాఖలో పవన్ అభిమానులను రెచ్చగొట్టడం, మంత్రిగా హుందాగా పని చేయకుండా ఇంటిపనులకు, స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కి డ్యామేజ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. అంతేకాదు, నగరి నియోజకవర్గం తో పాటు చిత్తూర్ జిల్లా వైసిపి నేతలతోనూ పొసగటం లేదు. తిరుపతి శ్రీవారు వద్ద ఇటీవల ఆమె చేసిన రచ్చ పార్టీకి నష్టం కలిగించేలా ఉంది. సేమ్ రోజా మాదిరిగా మరో మంత్రి ఉష శ్రీ చరణ్ శ్రీవారి చెంత వివాదాస్పదం అయింది. వాళ్ళిద్దరితో పాటు ఉత్తరాంధ్ర కు చెందిన మరో మంత్రికి కూడా ఉద్వాసన తప్పదని టాక్.

కల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవ‌లే జ‌గ‌న్ కేబినెట్లో చోటు సంపాదించినా, వ‌చ్చే సారి వీరికి టికెట్ క‌ష్ట‌మే అనే ప్రచారం ఉంది.
ఉష‌శ్రీచ‌ర‌ణ్ కు గ‌త ఎన్నిక‌ల్లో తొలి సారి అసెంబ్లీ టికెట్ ల‌భించింది. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి మీదే ఆమె ఘ‌న విజ‌యం సాధించారు. బీసీ కోటాలో ఆమెకు మంత్రి వ‌ర్గంలో చోటు కూడా ల‌భించింది. కురుబ సామాజిక‌వ‌ర్గానికి చెందిన శంక‌ర్ నారాయ‌ణ‌ను కేబినెట్ నుంచి తప్పించిన ప‌రిస్థితుల్లో అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఉష‌శ్రీ చ‌ర‌ణ్ కు జ‌గ‌న్ కేబినెట్లో చోటు ద‌క్కింది. మూడేళ్ల త‌ర్వాత ఆమెకు మంత్రివ‌ర్గంలో చోటు లభించటం సానుకూల‌మైన ప‌రిణామ‌మే. అయితే ఇప్పుడు ఆమెకు టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఆమె పెంచుకున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ఆమెకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చేందుకు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సానుకూలంగా ఉన్నార‌ని, ఈ నేప‌థ్యంలో టికెట్ ద‌క్క‌ని సిట్టింగుల జాబితాలో ఉష‌శ్రీ చ‌ర‌ణ్ ఉన్నార‌నేది టాక్.

జగన్మోహన్ రెడ్డి అనుకూల నేత‌ల్లో ఒక‌రుగా ఆర్కే రోజా ఉన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె పోరాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎమ్మెల్యేగా అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర‌మైన వేధింపుల‌నే ఎదుర్కొన్నారు. ఇక 2019లో మ‌రోసారి ఎమ్మెల్యేగా నెగ్గిన రోజాకు మంచి ప్రాధాన్య‌త ద‌క్కుతూ వ‌స్తోంది. ఆమెకు జ‌గ‌న్ కేబినెట్లో మొద‌ట చోటు ల‌భించ‌క‌పోయినా, ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది.
జ‌గ‌న్ కేబినెట్ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో ఆమె కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. తొలి స‌గంలో మంచి నామినేటెడ్ ప‌ద‌వి, రెండో స‌గంలో మంత్రి ప‌ద‌వి ఇలా ఐదేళ్ల కూ చాలా ప్రాధాన్య‌త‌ను పొందారు. కానీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో మాత్రం రోజాకు వ్య‌తిరేఖ ప‌రిణామాలున్నాయ‌నే ప్ర‌చారం ముందు నుంచి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆమెకు టికెట్ వ‌ద్ద‌ని కొందరు ప‌ట్టుబ‌ట్టారంటారు. జ‌గ‌న్ చొర‌వ చూపి ఆమెకు ఎమ్మెల్యే టికెట్, ఆ పై ఏపీఐఐసీ చైర్మ‌న్, ఇప్పుడు మంత్రి ప‌ద‌వితో అనూహ్య ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ రోజాకు అంతా సానుకూలంగానే ఉన్నా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె స్థానంలో న‌గ‌రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మ‌రొక‌రు పోటీ చేయ‌వ‌చ్చ‌నే టాక్ ఉంది.
వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రస్తుత కేబినెట్లో కొంద‌రు మంత్రుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భించ‌దా? అనే ప్ర‌శ్న ఆస‌క్తిని రేపుతూ ఉంది. కొన్ని నెల‌ల కింద‌టే ముఖ్య‌మంత్రి గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేబినెట్ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ చేశారు. అంత‌కు ముందున్న కేబినెట్ ను పూర్తిగా ర‌ద్దు చేసి, కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్న విషయం విదితమే. దాదాపు మూడేళ్ల పాల‌న అనంత‌రం పాత‌మంత్రుల స్థానంలో కొత్త మంత్రులు వ‌చ్చారు. కొత్త‌గా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడే ఆ కేబినెట్ కు రెండున్న‌రేళ్ల పాటు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఐదుమందిని త‌ప్ప మిగ‌తా వారంద‌రి స్థానంలో కొత్త వారికి అవ‌కాశం ఉంటుంద‌ని అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.
ఆ త‌రుణంలో కొంద‌రు హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను కూడా మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించారు. సీఎంపై ఈగ వాల‌నివ్వ‌రేమో అనేంత స్థాయిలో వ్య‌వ‌హ‌రించే వారిని కూడా పక్కన పెట్టారు. వారి స్థానంలో కొత్త వారికి అవ‌కాశం ఇచ్చారు. మూడేళ్ల త‌ర్వాత మెప్పు పొంది మంత్రి ప‌ద‌వుల‌ను పొందిన వారంటే వారి స్థాయి పెరిగిన‌ట్టే. మంత్రివ‌ర్గంలోని వారిని త‌ప్పించి వీరికి అవ‌కాశం ఇచ్చారంటే వీరి ప‌ట్ల జ‌గ‌న్ కు పూర్తి సానుకూల ధోర‌ణి ఉన్న‌ట్టే. ఇలా మంత్రివ‌ర్గంలో స్థానం పొందిన వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌దనే ప్రచారం ఉండటం అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశ‌మే. ప్ర‌స్తుత మంత్రుల విష‌యంలో ఇద్దరు మ‌హిళా మంత్రులే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి టికెట్ క‌ష్ట‌మే అనే జాబితాలో ఉన్నారని తెలుస్తుంది.
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ను ద‌క్కించుకోలేని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో రోజా కూడా ఒక‌ర‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. మొత్తానికి ఇలా ఇద్ద‌రు మ‌హిళా మంత్రుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌చ్చ‌నే అభిప్రాయాలు క్షేత్ర స్థాయి నుంచి, రాజ‌కీయ వ‌ర్గాల వరకు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ప్ర‌చారాలు ఎంత వ‌ర‌కూ నిజం అవుతాయ‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. సిట్టింగుల‌ను మార్చేందుకు జ‌గ‌న్ సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో వీరు మాజీ ఎమ్మెల్యేలుగా మిగ‌ల‌బోతున్నారా, లేక ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి మారుతుందా అనేది చూడాలి.