హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై రేగిన దుమారం చల్లారకముందే, సోషల్ మీడియా వేదికగా మరో కొత్త వివాదం రాజుకుంది. సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్‌క్రీమ్‌ను విక్రయిస్తోందంటూ జరుగుతున్న ప్రచారమే దీనికి కారణం. ఈ అంశం ప్రస్తుతం ఏపీలోని అధికార, విపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వైసీపీ వర్గాల ఆరోపణలు నిన్నటి వరకు దేవుడి ప్రసాదం పేరుతో రాజకీయాలు.. నేడు […]

Published By: HashtagU Telugu Desk
Heritage Ladoo Prasadam Ice Cream

Heritage Ladoo Prasadam Ice Cream

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై రేగిన దుమారం చల్లారకముందే, సోషల్ మీడియా వేదికగా మరో కొత్త వివాదం రాజుకుంది. సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్‌క్రీమ్‌ను విక్రయిస్తోందంటూ జరుగుతున్న ప్రచారమే దీనికి కారణం. ఈ అంశం ప్రస్తుతం ఏపీలోని అధికార, విపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

వైసీపీ వర్గాల ఆరోపణలు

“నిన్నటి వరకు దేవుడి ప్రసాదం పేరుతో రాజకీయాలు.. నేడు లడ్డూ ప్రసాదం పేరుతో వ్యాపారాలు” అంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టులు పెడుతున్నారు. హెరిటేజ్ సంస్థ హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని, పవిత్రమైన ప్రసాదం పేరును తమ వ్యాపార ఉత్పత్తులకు వాడుకోవడం ద్వారా తిరుమల ప్రసాదాన్ని అవమానిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించినవంటూ కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. పవిత్ర ప్రసాదం పేరుతో ఐస్‌క్రీమ్ అమ్మడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ కౌంటర్.. ఇది ఫేక్ ప్రచారం

ఈ ప్రచారాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ‘Fact Check Tdp’ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఇది పూర్తిగా కల్పితమని, అసలు హెరిటేజ్ సంస్థ ఆ పేరుతో ఎలాంటి ఐస్‌క్రీమ్‌ను ఉత్పత్తి చేయడం లేదని స్పష్టం చేశాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి మహా పాపానికి పాల్పడ్డారని, ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ ఇలాంటి ఫేక్ ఫ్యాక్టరీలలో ఫేక్ ఉత్పత్తులు సృష్టించి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించాయి. హెరిటేజ్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ ఫేక్ ప్రచారానికి తెరలేపారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

గందరగోళంలో నెటిజన్లు

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోషల్ మీడియాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ‘లడ్డూ ప్రసాదం’ అని పేరు పెట్టారు కానీ, ఏ దేవుడి పేరునూ ప్రత్యేకంగా వాడలేదు కదా అని కొందరు వాదిస్తుండగా, అసలు ప్రసాదం పేరును వాణిజ్య ఉత్పత్తికి పెట్టడమే తప్పని మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు హెరిటేజ్ సంస్థ నిజంగానే ఈ ఐస్‌క్రీమ్‌ను తయారు చేసిందా? లేక ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన ఫేక్ ప్రచారమా? అనే దానిపై స్పష్టత కొరవడింది. ఈ వివాదంపై హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అధికారికంగా స్పందించి, వాస్తవాలను వెల్లడిస్తేనే ఈ దుమారానికి తెరపడే అవకాశం ఉంది.

  Last Updated: 15 Apr 2026, 10:59 AM IST