Smart meters issue : జగన్ `స్మార్ట్` సాహసం, ఎమ్మెల్యేలకు `మీటర్ల` షాక్ !

ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది.

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 02:59 PM IST

ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రైతులకు నష్టం చేస్తుందని.. అందువల్ల దీన్ని అమలు చేసే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఖరాఖండీగా తేల్చిచెప్పింది.

మరోవైపు ఈ స్కీమ్ను అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉండటంపై రైతు సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా పారదర్శకత జవాబుదారీతనం కోసమే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నప్పటికీ ఈ పథకంపై రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. నేరుగా డైరెక్ట్ టు ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో లబ్ధిదారులైన రైతుల ఖాతాలకే నేరుగా జమ చేస్తామని అంటున్నారు.అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని రైతు సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. గ్యాస్ బండ ఇంటికొస్తే మొత్తం డబ్బులు మీరు చెల్లించండి.. సబ్సిడీని మీ బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రజలకు కేంద్రం చెప్పింది. అన్నట్టుగానే మొదట్లో సబ్సిడీని బాగానే చెల్లించింది. మొదట్లో గ్యాస్ సబ్సిడీ కింద రూ.400 వరకు లబ్ధిదారుల ఖాతాల్లో పడేది. ఆ తర్వాత రానురాను ఈ సబ్సిడీ మొత్తం కుచించుకుపోయి రూ.150లోపుకు పడిపోయింది. ఆ తర్వాత రూ.5 రూ.10కి పడింది. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ రూపాయి కూడా జమ కావడం లేదు.

ఇప్పుడు ఇదే కోవలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతుండటం కూడా గ్యాస్ సబ్సిడీనే తలపిస్తుందని ప్రతిపక్షాలు రైతుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడంవల్ల కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ చార్జీలను డీబీటీ ద్వారా నేరుగా రైతు ఖాతాలకే జమచేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారన్నారు. దీనివల్ల రైతులు నేరుగా తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును డిస్కంలకు చెల్లిస్తారని పెద్దిరెడ్డి చెబుతున్నారు.

ప్రస్తుతం ఉచిత వ్యవసాయ విద్యుత్ అమల్లో ఉంది. దాన్ని ఎత్తేసి వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం వచ్చే విద్యుత్ బిల్లులకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులేయడం రైతులు డిస్కమ్లకు కరెంటు బిల్లులు చెల్లించడం.. అసలు ఇదంతా ఎందుకని నిలదీస్తున్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ను యథావిధిగా అమలు చేస్తే సరిపోతుంది కదా రైతులు ప్రశ్నిస్తున్నారు.కానీ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. రైతులే నేరుగా బిల్లులు చెల్లిస్తే డిస్కమ్లను నాణ్యమైన విద్యుత్పై ప్రశ్నించే వీలు కలుగుతుందని చెబుతోంది. తద్వారా డిస్కంలు బాధ్యతగా ఉంటాయంటోంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో 18 వేల మీటర్లు రైతుల మోటర్లకు బిగించామని మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొంటోంది. ఆ మీటర్ల వల్ల 30–36 శాతం విద్యుత్ ఆదా అవుతోందని గణాంకాలు చెబుతోంది. ముందు రైతులు తమ మీటర్లకు వచ్చిన బిల్లులు కట్టాలని ప్రభుత్వం చెబుతోంది. తర్వాత ఆ బిల్లుల మొత్తాలను లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామంటోంది. ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా.. సకాలంలో రైతుల ఖాతాల్లో బిల్లుల మొత్తం వేయకపోయినా ఇబ్బందే అంటున్నారు. రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించకలేకపోతే డిస్కమ్లు కరెంటు సరఫరా ఆపివేయడం ఖాయమని ఏతావాతా స్మార్ట్ మీటర్ల వల్ల ఇబ్బంది పడేది రైతులేనని చెబుతున్నారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ మీటర్ల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టెండర్లపైనా వివాదాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే పలు పత్రికల్లో ఈ టెండ్లర అప్పగింతలో గోల్మాల్ జరుగుతోందని కథనాలు ప్రచురించాయి.