Lankapalli Vasu : ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కొందరు తెలుగు నటులు, పెద్దసంఖ్యలో తెలుగు యువతీ, యువకులు పాల్గొన్న విషయం కలకలం రేపింది. ఆ రేవ్ పార్టీలో పెద్దమొత్తంలో డ్రగ్స్ను వినియోగించిన విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన బుకింగ్స్ను చేసిన వ్యక్తి కూడా తెలుగువాడే అని దర్యాప్తులో తేలింది. ఆ కాస్ట్లీ బుకీ పేరే లంకపల్లి వాసు. విజయవాడకు చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన వాసు.. ఇప్పుడు పెద్ద బెట్టింగ్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పబ్లు నడుపుతున్నాడు. వాసుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫ్యామిలీతో విజయవాడలోనే ఉంటాడు. రేవ్ పార్టీల బుకింగ్స్, పబ్ వ్యవహారాలు చూసుకోవడానికి వారానికి ఒకటి, రెండు రోజులు వాసు హైదరాబాద్కు వచ్చి వెళ్తుంటాడు. విజయవాడలో ఎవరైనా అడిగితే.. తాను దుబాయ్, బెంగళూరు, మలేషియాలలో పనిచేస్తున్నట్లు బుకాయిస్తాడు. ముంబైలోని ఓ అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహరాలను వాసు నడుపుతుంటాడు. బెంగళూరు రేవ్పార్టీలో తప్పితే ఇంతవరకు ఎక్కడా పోలీసులకు వాసు పట్టుబడలేదు.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి క్రికెటర్ కావాలనే కోరిక వాసుకు ఉండేది. అందుకే క్రికెట్లో బుకీగా మారాడు. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా ప్రధాన క్రీడల బెట్టింగుల్లో బుకీగా వ్యవహరించేవాడు. దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి బెట్టింగ్ దందా నడిపేవాడు. ఒక్క విజయవాడలోనే ఇతడి బెట్టింగ్ నెట్వర్క్లో దాదాపు 150 మంది ఉన్నారు. వాసుకు నాలుగు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాల్లో విల్లాలు, ఇళ్లు కొన్నాడు. లాక్డౌన్ సమయంలో క్రికెట్ ఆడుతుండగా వాసు(Lankapalli Vasu) కాలికి పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవలి వరకు చేతి కర్ర సాయంతోనే నడిచేవాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. గుండె సంబంధిత సమస్యలు రావడంతో స్టంట్ వేసినట్లు సమాచారం.
వాసు పుట్టినరోజు వేడుకల పేరుతో ఈ నెల 18న సాయంత్రం బెంగళూరులో రేవ్పార్టీ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల కుటుంబీకులు, సినీ, బుల్లితెర కళాకారులూ కలసి 250 మంది హాజరయ్యారు. ఇప్పటికి 101 మందిని గుర్తించగా.. పరారైనవారి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల హిట్లిస్ట్లో ఉన్న మత్తుపదార్థాల సరఫరాదారు రాజ్భావ ఈ పార్టీకి డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషించాడని సమాచారం.ఈ పార్టీలో పాల్గొన్నవారి బ్లడ్ శాంపిల్స్ను టెస్టు కోసం పంపారు. వాటి రిపోర్టులు రాగానే తదుపరి చర్యలు మొదలవుతాయి.