AP News: పవన్ ని నమ్మి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు: సజ్జల

చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

AP News: చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు జైలులో ఉండగా ఒక్క టీడీపీ కార్యకర్త కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు కేవలం పవన్ కళ్యాణ్ ను నమ్మి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాపు సామాజికవర్గం ఓట్లు వేస్తే తప్ప రాజకీయాలు చేయలేని పరిస్థితికి చంద్రబాబు వెళ్లారని సెటైరికల్ కామెంట్స్ చేశారు సజ్జల. .

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 హయాంలో రాష్ట్రాన్ని నాశనం చేశారని సంచలన ఆరోపణలు గుప్పించారు సజ్జల. జగన్ వచ్చాక రాష్ట్రంలో ఒక్కో ఇటుక పేర్చుతూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ప్రజల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదని గుర్తు చేశారు. అనుకూల పచ్చ మీడియాలో వార్తలు రాస్తూ చంద్రబాబు భ్రమలో బతుకుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ జగన్ భుజం మీదకు తెచ్చుకున్నారు. ఒక చోట టికెట్ ఇవ్వలేకపోతే మరో చోట కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో నాయకుడి మాట కాదనేవారు లేరని చెప్పారు. చిన్నచిన్న అసంతృప్తులన్నింటినీ చక్కదిద్దుకుంటామని సజ్జల ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఎల్లో మీడియా టీడీపీని, చంద్రబాబును నడుపుతోంది. అందులో చూపిస్తునట్లుగానే పగటి కలలు కంటున్నారు. వై నాట్ 175 సీట్స్ లక్ష్యంతో పని చేస్తున్నాం. కానీ చంద్రబాబు మాత్రం చిల్లర రాజకీయాలు ఎలా చేయాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. టీడీపీకి అసలు అభ్యర్థులు ఉన్నారో లేదో కూడా తెలియదని సజ్జల అన్నారు.

Also Read: Praja Bhavan : ఇక ప్రజా భవన్..డిప్యూటీ సీఎంకే – చీఫ్ సెక్రటరీ ఆదేశాలు