Site icon HashtagU Telugu

YSRCP : వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌పై మరో కేసు

Ysrcp

Ysrcp

YSRCP : వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి, ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలైన వర్రా రవీంద్రారెడ్డి, అర్జున్ రెడ్డిలపై మరో కొత్త కేసు నమోదైంది. ఈ కొత్త కేసులో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరమైన పోస్టులు పంచుకోవడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించడాన్ని ఆరోపిస్తూ, సిద్ధవటం మండలంలోని ఎస్. రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ నెల 8వ తేదీ నందలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు ప్రస్తుతం నందలూరు నుంచి పులివెందులకు బదిలీ చేయబడింది. ఇంతకుముందు కూడా సజ్జలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదవ్వడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో, సజ్జల భార్గవ్ రెడ్డి తనపై నమోదైన కేసుల నుంచి ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలయింది, కానీ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేసి, సజ్జలకు ఊరట ఇవ్వలేదు. హైకోర్టు కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో, సజ్జల భార్గవ్ తరఫున ఆయన లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, BNS చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగినందున చట్టం 111 వర్తించదని పేర్కొన్నాడు. అయితే, హైకోర్టు ఈ అంశంపై లోతుగా విచారించమని సూచించింది.

ఇది కాకుండా, సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు, సజ్జల భార్గవ్‌పై కడప జిల్లా పోలీసులు “లుక్ ఔట్” నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సజ్జల భార్గవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also : Mahesh Kumar Goud : లగచర్ల దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్