Site icon HashtagU Telugu

RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మ‌రోసారి స్పందించిన రోజా.. చంద్ర‌బాబే తొంద‌రుప‌డ్డారు..!

RK Roja Reaction

RK Roja Reaction

RK Roja Reaction: తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మాజీ మంత్రి రోజా (RK Roja Reaction) త‌న ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. “శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నిత‌మైన భ‌క్తుల మ‌నోభావాల‌తో కూడుకున్న శ్రీ‌వారి ప్ర‌సాదాల విష‌యంలో రాజ‌కీయ దురుద్దేశ‌పూరిత వ్యాఖ్య‌లు అంద‌రూ మానుకుంటే మంచిది. మొద‌టి నుంచి మేము భావిస్తున్న‌ది రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే విచార‌ణ‌, ఆధారాల‌తో సంబంధం లేకుండా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో వారి ప‌రిధిలోని విచార‌ణ‌తో నిజాలు బ‌య‌టికి రావ‌ని స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ కావాల‌ని కోరుకున్నాం. కేంద్ర ప్ర‌భుత్వం కూడా సిట్ స‌రిపోద‌ని, కేంద్ర ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌ర‌గాల‌నే వాద‌న‌తో మా డిమాండ్‌కు విశ్వ‌స‌నీయ‌త పెరిగింది. సుప్రీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్వ‌తంత్ర ద‌ర్యాప్తుతో వాస్త‌వాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని, త‌ద్వారా గాయ‌ప‌డిన కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల్ని పున‌రుద్ధ‌రించిన‌ట్టు అవుతుంద‌ని తిరుప‌తి ఆడ‌బిడ్డ‌గా న‌మ్ముతున్నాను” అని ఆమె ట్వీట్ చేశారు.

Also Read: Car Buyers: పాత కార్ల‌కు చెక్ పెట్టేందుకు కొత్త ఆఫ‌ర్‌.. ఏంటంటే..?

సుప్రీంకోర్టు తాజా తీర్పు

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్‌ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్నారు. స్వతంత్ర సిట్‌ను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు, Fssai నుంచి ఒకరు ప్రాతినిథ్యం వహించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ల‌డ్డూ విష‌యం రాజ‌కీయం కాకుండా ఉండేందుకు ఈ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కోర్టు తెలిపింది.

తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఆదేశించింది. ఈ దర్యాప్తునకు ఎలాంటి నిర్దిష్ట సమయం సూచించలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివాదంపై రాజకీయ నేతలు మాట్లాడవద్దని సుప్రీం సూచించింది. లడ్డూను రాజకీయం చేయవద్దని కోరింది. సుప్రీం కోర్టు సూచనలతో ఈ వివాదంపై రాజకీయ నేతల నోళ్లు మూతబడినట్లే అని అర్థ‌మ‌వుతోంది.