Akhanda Godavari Project : రాజమహేంద్రవరం పేరు వింటే వెంటనే గోదావరి తీరాలు గుర్తుకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను గుర్తుచేశారు. ఇది నాగరికతకు నిలయం. గోదావరి తీరం వెంట భాష, సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది సాంస్కృతికంగా విలువైన భూమి అని ఆయన అన్నారు.ఈ ప్రాంతం ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన మట్టిది. ఆదికవి నన్నయ్యతో పాటు ఎన్నో తరాలకూ కళ, సాహిత్యంలో పునాది వేసిన ప్రాంతం ఇదే. ఇలాంటి ప్రాజెక్టులు ఏకకాలంలో అభివృద్ధికి బీజం వేయడమే కాకుండా, ఎంతో కాలంగా ప్రజలు కలలుకన్న స్వప్నాల సాధనకు మార్గం చూపుతాయి అన్నారు.
Read Also: Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు..అమ్మవారికి తొలి సారె
పర్యాటక రంగం వృద్ధి చెందడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, ప్రతి ఏటా కనీసం 4 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారని అంచనా. ఆర్థికాభివృద్ధికి ఇది పెద్ద ఊపిరిగా మారుతుంది. శక్తిమంతమైన నాయకత్వం, దృఢమైన ప్రభుత్వానికి ఇది సాధ్యమవుతుంది అని అన్నారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో కేంద్ర మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగిన దానికి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారం కీలకం. రాష్ట్రానికి ఆయన చేస్తున్న సేవలు ఎనలేనివి. ఆయనకు రాష్ట్రం కృతజ్ఞతలు తెలపాలి అని పవన్ పేర్కొన్నారు.
అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు పునరుజ్జీవం అవసరమని అన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన గజేంద్ర సింగ్ షెకావత్ గారు వీరుల పుట్టిన మట్టిలో జన్మించారు. ఆంధ్రుల పౌరుషం, ధైర్యాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఆయన. అందుకే రాష్ట్రాభివృద్ధికి అనుకూలంగా పనిచేస్తున్నారు అన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతం గోదావరి ఒడ్డున కల సాంస్కృతిక వైభవాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చే దిశగా అడుగులు వేయడం హర్షణీయమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల జీవనశైలి, ప్రాంత అభివృద్ధి, పర్యాటక రంగం శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది. కూటమితో కలిసి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో భాగంగా అఖండ గోదావరి ప్రాజెక్టు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.