Retired DGP Baburao : ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ‘ఎకోల్ సుపరీయర్ రాబర్ట్ డీసోర్బన్’ రిటైర్డ్ డీజీపీ కూచిపూడి బాబూరావుకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. భారతదేశంలో ఎంతోమంది ప్రముఖులకు అందించిన ఈ అవార్ట్ ఇప్పుడు బాబూరావును వరించింది. అంబేద్కర్ ఆశయాలతో పోలీస్ అధికారిగా ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తించిన ఈ యూనివర్సిటీ భారత్ సమ్మాన్ అవార్డ్ తో పాటు గౌరవ డాక్టరేట్ ను ఈనెల 12న దుబాయ్ వేదికగా అందించింది. మధ్యప్రదేశ్ కేడర్ లో ఐపీఎస్ అయి దళిత జాతి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగి అడిషనల్ డీజీపీ హోదాలో ఎంతోమందికి సేవ చేసిన కూచిపూడి బాబూరావును ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక డాక్టరేట్ వరిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
కూచిపూడి బాబూరావు(Retired DGP Baburao) గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో ప్రకాశం, అనంతమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేశారు. ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు. 1980లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవోగా పని చేశారు. 1991లో ఆయన ఐపీఎస్ కు మధ్యప్రదేశ్ కేడర్ లో సెలెక్ట్ అయ్యారు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్ లో ఐపీఎస్ అధికారిగా అనేక హోదాల్లో పని చేసి ప్రజలకు చేరువయ్యారు.. 36ఏళ్లపాటు పోలీస్ అధికారిగా(Retired DGP Baburao) మచ్చలేని వ్యక్తిగా ..ప్రజాసేవలో జీవితాన్ని మమేకం చేశారు..అక్కడ కరడుగట్టిన క్రిమినల్స్ నేరస్వభావాన్ని మార్చడానికి విపరీతంగా ప్రయత్నించారు. వివిధ నేరాల్లో చిక్కుకుని జైలుపాలయిన నేరస్తుల కుటుంబసభ్యులకు అండదండగా నిలిచారు. కుటుంబపెద్ద నేరం చేసి జైలుకు వెళ్లిన సందర్భాల్లో మిగిలిన కుటుంబసభ్యులంతా ఆర్థికసమస్యలతో సతమతమవుతుంటే వారందరినీ అనేక రకాలుగా బాబూరావు ఆదుకున్నారు. నేరస్తుల పిల్లల్ని చదివించడమే గాకుండా వారు మంచిమంచి స్థానాలకు చేరుకునేలా ప్రోత్సహించారు. అడిషనల్ డీజీపీ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు..
Also Read: Chennamaneni Ramesh : చెన్నమనేని రమేశ్ పాస్పోర్టుపై కేంద్రం కీలక నివేదిక
ప్రజాసేవలో కూచిపూడి బాబూరావు సేవాభావ ధృక్పధం, ప్రజలకు సేవ చేయడంలో ఆయన పడిన తపనను గుర్తించిన ఎకోల్ సుపీరియర్ రాబర్ట్ డీ సోర్బన్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. భారతదేశం నుంచి ఈ భారత్ సమ్మాన్ అవార్డ్ ,గౌరవడాక్టరేట్ ను ఇంతకుముందు అనేకమంది ప్రముఖులు అందుకున్నారు. భారత విదేశీవ్యవహారాల మంత్రి మీనాక్షిలేఖి, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసిన పద్మభూషణ్ డాక్టర్ రామ్ సుతార్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్, సినీ నటుడు డాక్టర్ అంజన్ శ్రీవాస్తవ్, బాలీవుడ్ నటుడు సోనూసూద్, కాంగో రక్షణమంత్రి డాక్టర్ సిల్వైన్ ముటోమ్ డో, దుబాయ్ ఫార్మసీ మంత్రి డాక్టర్ అలీ అల్ సయ్యద్ హుస్సేన్, ఇండియన్ క్రికెటర్ హర్బజన్ సింగ్ లాంటివారు ఈ ఆవార్డును పొందారు. ఇప్పుడు అదే లిస్టులో మన తెలుగు జాతి రత్నం కూచిపూడి బాబూరావు చేరారు.