JC Diwakar Reddy : అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి టీడీపీ ఝలక్ ఇచ్చింది. జనసేనతో టీడీపీ సీట్ల సర్దుబాటు కారణంగా జేసీ ఫ్యామిలీలో రాజకీయ చీలిక ఏర్పడింది. తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ ప్రభాకర్రెడ్డి కొడుకు అస్మిత్రెడ్డికి అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. అయితే జేసీ దివాకర్రెడ్డి కొడుకు పవన్కు మాత్రం సైకిల్ పార్టీ మొండిచెయ్యి మిగిల్చింది. అనంతపురం ఎంపీ సీటు కోసం జేసీ పవన్ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అనంతపురం లోక్సభ స్థానం నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని జేసీ పవన్ టీడీపీని కోరారు. ఈక్రమంలోనే ఇటీవల ఆయన చంద్రబాబును కూడా కలిశారు. అయితే టిక్కెట్ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో జేసీ దివాకర్రెడ్డి కుటుంబ పయనం ఎటు వైపు అనే చర్చకు తెర లేచింది. రాయదుర్గం టిక్కెట్ను తన అల్లుడు దీపక్రెడ్డికి కేటాయించాలని నారా లోకేశ్ను జేసీ ప్రభాకర్రెడ్డి కోరుతున్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
2014లో జేసీ వర్గం టీడీపీలోకి వచ్చింది. జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు అస్మిత్రెడ్డికి దాదాపుగా సీటు ఖరారైన నేపథ్యంలో.. దివాకర్రెడ్డి(JC Diwakar Reddy) కొడుకు పవన్రెడ్డి కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. ఒకవేళ పవన్కు టికెట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమనేలా కనిపిస్తోంది. ఎందుకంటే కుటుంబానికి ఒక్కటే టికెట్ అని బాబు తేల్చి చెప్పారు. జేసీ వర్గానికి రెండు ఇస్తే తమకూ రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పరిటాల వర్గం పట్టుబట్టనుంది. మొత్తం మీద అనంతపురం స్థానాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయని ఆ పార్టీ నేతలు కోడైకూస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల అధికార పార్టీ వైసీపీ గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త ఇంఛార్జిల నియామకం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు లిస్టులని ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఐదో లిస్టుపై కసరత్తు చేస్తోంది. టీడీపీ అధినేత ఇద్దరు అభ్యర్థులను ప్రకటించగా .. జనసేన కూడా ఇద్దరిని ప్రకటించింది.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. పైగా 2014లో గెలిచారు. ఇప్పుడు ఆయనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో లోలోపల అధినేతపై రగిలిపోతున్నారు. ∙గుంతకల్లు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడైన జితేందర్గౌడ్కు టికెట్ లేదని పరోక్షంగా లీకులు ఇస్తుండటంతో టీడీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్లుగా పార్టీ జెండాను మోసిన తనను కాదని వేరేవాళ్లకు ఇస్తే ఎలా గెలుస్తారో తానూ చూస్తా అని వ్యాఖ్యానిస్తున్నారు. పుట్టపర్తి సీటుపైనా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి పని చేసేది లేదని ఆయన ఇప్పటికే క్యాడర్తో చెప్పినట్టు తెలుస్తోంది. పైగా ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.