TDP – Janasena : నసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ను పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళ వారం ఉదయం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఈసందర్భంగా జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేరును సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా పార్టీ ఎమ్మెల్యేలంతా బలపరిచారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచి అందరినీ ఆశ్చర్యపర్చింది.
విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీయే కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ భేటీలోనే టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ పార్టీ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా, పార్టీ ఎమ్మెల్యేలంతా బలపరిచారు. కాసేపట్లో ఏపీ ఎన్డీయే కూటమి నేతగానూ చంద్రబాబును ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్డీయే కూటమి తరఫున చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి తమ మద్దతు లేఖల్ని అందిస్తారు. దీంతో రేపటి (జూన్ 12న) చంద్రబాబు ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం అవుతుంది. ఏపీ ఎన్డీయే కూటమి సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు బీజేపీ కూడా తమ శాసనసభా పక్ష నేత ఎంపికకు సన్నాహాలు చేస్తోంది. బీజేపీలో ఈసారి శాసనసభాపక్ష నేత పదవికి తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ సీనియర్ నేతలు సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్లలో ఒకరికి బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.