జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించారు. దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో.. అటువంటి వారిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ‘‘ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందలు వేలకోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజులలో మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేసినప్పటికీ చరమాంకంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన వాజ్పేయి గారు గురించి ఏమని చెప్పాలి. అందుకేనేమో ఆయన భారతరత్నగా మనందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని చవిచూసిన వాజ్పేయి గారు దేశమే జీవితం అనుకొని బ్రహ్మచారిగానే మిగిలిపోయారు’’ అని అన్నారు.
‘‘సంస్కృతం, హిందీ ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన పాత్రికేయునిగా పని చేస్తూనే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన నిర్వర్తించిన పదవులు ఎన్నో. జనతా ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా తన ప్రతిభను చాటుకున్నారు. పార్లమెంటేరియన్ గా ఆయన సుదీర్ఘంగా పని చేశారు’’ పవన్ గుర్తు చేశారు.
‘‘బిజెపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా ఆయన హయాంలో మన దేశం ఎన్నో విజయాలను చవిచూసింది. రాజస్థాన్ ఎడారిలో అణుపరీక్షలు జరిపి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా నిలిపింది ఆయనే. ప్రైవేటు రంగాన్ని పటిష్టపరచటం, దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు రవాణా వ్యవస్థను విస్తరించటం ఆయన సాధించిన విజయాలే. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఆయన వాగ్దాటి పార్లమెంటును అబ్బురపరిచేది. విలక్షణమైన ఆయన కవితా ఝరి పామరులను సైతం ఆకట్టుకునేది’’ అంటూ పవన్ నివాళులు అర్పించారు.
Also Read: Bollywood Boxoffice: బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన గదర్-2, ఐదు రోజుల్లో 300 కోట్లు వసూల్