AP : జగన్..బీసీల పొట్టకొట్టాడు – జయహో సభలో పవన్ కీలక వ్యాఖ్యలు

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 08:09 PM IST

సీఎం జగన్..అధికారంలోకి రాగానే బీసీల పొట్ట కొట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జయహో బీసీ పేరిట భారీ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)లతో పాటు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీసీ డిక్లరేషన్‌ ను అధినేతలు ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) రూపొందించారు. మొత్తం 10 అంశాలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో మొదటిగా 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ అధికారంలోకి రాగానే బీసీల పొట్ట కొట్టారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘సీఎం జగన్ పాలనలో 300 మంది బీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారి సంక్షేమానికి రూ.75 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారు. ఇసుక రీచ్‌లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టారని, బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్లను ప్రకటించి కుర్చీలు కూడా ఇవ్వలేదు. వారికిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. తనకు అండగా నిలిచిన వారినే వంచించారు. జగన్ పాలనలో BCలకు రక్షణ కరువైంది’ అని పవన్ పేర్కొన్నారు.

బీసీలకు సాధికారత ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తిని తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. సంపద సృష్టించే స్థాయికి ఎదిగేలా బీసీలకు అండగా ఉంటామని అన్నారు. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో ప్రతి 30 కిలో మీటర్లకు ఓ జెట్టి ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ హామి ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల పిల్లలకు ఆదర్శ పాఠశాలలు నిర్మిస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53 శాతం జనాభా బీసీలే ఉన్నారని, బీసీలు ఐక్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు. రామ్‌మనోహర్ లోహియాను ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా తీసుకున్నారన్న పవన్, స్థానిక సంస్థల్లో తగ్గించిన రిజర్వేషన్‌ను టీడీపీ- జనసేన అధికారంలోకి వచ్చాక పెంచుతామన్నారు. టీడీపీ – జనసేన ప్రభుత్వం వడ్డెర కులస్థులకు ఆర్ధిక పరిపుష్టి కల్పించడంలో ప్రాధాన్యం ఇస్తుందని పవన్ వెల్లడించారు. బీసీ అన్ని కులాలకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీసీలపై దాడులు జరిగితే తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటామని పవన్ స్పష్టంచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బీసీ డిక్లరేషన్‌లోని అంశాలు చూస్తే ..

1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం. 5 పెన్షనను నెలకు రూ.4 వేలకు పెంచుతాం.

2. ప్రత్యేక రక్షణ చట్టం: జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ‘ప్రత్యేక రక్షణ

చట్టం’ తీసుకొస్తాం. ఎ) సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం.

3. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.

ఎ) వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోనమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

4. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారు. అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం.

ఎ) చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.

బి) అన్ని సంస్థలు. నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్

సి) తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం.

. ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం

ఎ) జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.

బి) దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.

సి) స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.

డి) జగన్రెడ్డి ‘ఆదరణ’ లాంటి 30 పథకాలు రద్దు చేశారు. రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.

ఈ) మండల/నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్,

ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. ఎఫ్) జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.

6 . చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం

7. చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్ధరిస్తాం. పెళ్లి

కానుకలు రూ.లక్షకు పెంపు

8. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.

9. విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం

ఎ) నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం.

బి) షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.

సి) పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం.

డి) స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంబిస్తాం. 10.బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం.

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు… బ్యాక్ బోన్ క్లాసెస్

Read Also :  Byreddy Shabari : టీడీపీలోకి బైరెడ్డి శబరి..? నంద్యాల నుంచి పోటీ..?