Tirumala: తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తోందని భక్తులు అంటున్నారు. పులివెందుల నుంచి భక్తులు మెట్ల మార్గం వైపు వెళ్తుండగా.. చిరుతపులి వేగంగా రోడ్డు దాటుతున్నట్లు తెలిపారు. వెంటనే భక్తులు అప్రమత్తమై టీటీడీ భద్రతా అధికారులకు సమాచారం అందించారు. తిరుమల నడకదారిలో చిరుతలు కలంకలం రేపుతూనే ఉన్నాయి. జూన్ నెలలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. ఆ తర్వాత ఆగస్టు నెలలో నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన లక్షిత అనే బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ రెండు ఘటనల తర్వాత టీటీడీ మరింత అప్రమత్తమైంది. వెంటనే బోన్స్, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతలను బంధించారు. అలాగే నడిచే మార్గాల్లో కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది.
మరోవైపు చిరుతల నుంచి రక్షణ కోసం టీటీడీ కర్రలు పంపిణీ చేస్తోంది. నడకదారిలో భక్తులను గుంపులుగా పంపిస్తారు. అవసరమైన చోట్ల గార్డులను కూడా నియమించినట్లు తెలిసింది. 12 ఏళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలను వారి తల్లిదండ్రులతో ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. రాత్రి 10 గంటల తర్వాత పెద్దలను కూడా అనుమతించరు. అలాగే తిరుమల వెళ్లే ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సైకిళ్లను అనుమతించగా.. తాజాగా ఆ నిబంధనను సడలించారు.
అంతేదు తిరుమలకు వెళ్లే నడక మార్గాల్లో సాధు జంతువులకు తినుబండారాలు ఏర్పాటు చేయవద్దని టీటీడీ సూచించింది. ఇలాంటి ఆహార పదార్థాలను ఎవరైనా జంతువులకు అందజేసి ఆహార పదార్థాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నడకదారిలో హోటళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు వదలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న టీటీడీ.. ఇప్పటికే తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Vennela Kishore: ‘చారి 111’గా ‘వెన్నెల’ కిశోర్ ఫస్ట్ లుక్, స్పై యాక్షన్ కామెడీలో స్టైలిష్ లుక్