ఆంధ్రప్రదేశ్లో ఒక పురుగు ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది. అది ఒంటిపై పాకితే చాలు అలర్జీ, దద్దుర్లు వస్తున్నాయి. పాపం, రోజువారీ కూలీ పనులకు వెళ్లేవారు ఈ పురుగుల దెబ్బకు దురదతో అల్లాడిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక మొక్కల పెంపకానికి మంచి గుర్తింపు పొందిందని తెలిసిందే. అక్కడ నర్సరీలలో మొక్కల పెంపకం చేపడతారు. ప్రతిరోజూ అక్కడి నుంచి మొక్కలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నర్సరీలలో సుమారు 50 వేల మంది వరకు శ్రామికులు జీవనోపాధి పొందుతున్నారు. వర్షాలు పడటంతో కొద్దిరోజులుగా మొక్కల ఎగుమతి పెరిగింది.
ప్రస్తుతం నర్సరీల్లో పని చేస్తున్న కూలీలకు యాసిడ్ పురుగు వణికిస్తోంది. నర్సరీల్లో మొక్కల ఏరివేత, మొక్కల్ని కదిలించే సమయంలో ఈ పురుగులు ఒళ్లంతా పాకుతున్నాయి. ఈ పురుగుల్ని తొలగించే క్రమంలో చేతులతో వాటిని నలిపి ప్రయత్నిస్తున్నారు. దీంతో వారికి దద్దుర్లు ఏర్పడి, దురద మంటతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పురుగులు చూడటానికి చీమల్లాగే పొడవుగా ఉన్నాయి. ఈ పురుగుల్ని పెడిరోవ్ బీటిల్స్, యాసిడ్ పురుగు అని పిలుస్తారు. ఒకవేళ ఈ పురుగు ఒంటిపై పాకితే భయంతో నలిపేస్తున్నారు. అప్పుడు పురుగు తోక చివరి భాగంలో పెడిరిన్ అనే విషపదార్థం పైకి వస్తుంది. ఫలితంగా చర్మంపై అలెర్జీ వల్ల దద్దుర్లు వస్తాయి.
ఈ యాసిడ్ పురుగులు పొరపాటున కూడా కంటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ పురుగు తోకలో ఉండే పెడిరిన్ కారణంగా తీవ్ర ప్రమాదం ఉందని, కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ సమస్యను నైరోబీ-ఐ అని పిలుస్తుంటారు. ఒకవేళ ఈ పురుగు పాకిన చోట లేదా పురుగును నలిపిన చోట సబ్బుతో రుద్ది నీళ్లతో కడగాలని చెప్పారు. పురుగు పాకిన చోట రుద్దడం, గోకడం వంటివి చేయకూడదంటున్నారు. అలర్జీ తగ్గేందుకు డాక్టర్ను సంప్రదించి, వారు సూచించే మందులు వాడాలని సూచిస్తున్నారు. సొంత వైద్యం చేయకూడదని, ఎలాంటి పసరు కూడా వాడకూడదని చెప్పారు. నర్సరీల్లో పనిచేసే శ్రామికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
