130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.

Vijayawada Krishna Palace Bridge Demolition  కృష్ణా నదిపై స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగలబోతోంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి కూల్చివేతలు మొదలుపెట్టారు. కొత్త డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఈ పాత బ్రిడ్జి పిల్లర్లను కూల్చివేయబోతున్నారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో కూల్చివేతలు సాధ్యం కాకపోవడంతో అధికారులు లిమిటెడ్ బ్లాస్టింగ్ విధానంలో కూల్చేందుకు సిద్ధమవుతున్నారట. విజయవాడలో 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన […]

Published By: HashtagU Telugu Desk
Vijayawada Krishna Palace Bridge Demolition

Vijayawada Krishna Palace Bridge Demolition

Vijayawada Krishna Palace Bridge Demolition  కృష్ణా నదిపై స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగలబోతోంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి కూల్చివేతలు మొదలుపెట్టారు. కొత్త డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఈ పాత బ్రిడ్జి పిల్లర్లను కూల్చివేయబోతున్నారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో కూల్చివేతలు సాధ్యం కాకపోవడంతో అధికారులు లిమిటెడ్ బ్లాస్టింగ్ విధానంలో కూల్చేందుకు సిద్ధమవుతున్నారట.

విజయవాడలో 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రిటీష్ కాలం నాటి రైల్వే బ్రిడ్జి కనుమరుగు కాబోతోంది. 1893లో నిర్మించిన ఈ బ్రిడ్జి స్థానంలో కొత్తగా డబుల్ లైన్ బ్రిడ్జిని నిర్మించాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. గతంలోనే ఈ బ్రిడ్జిపై ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయగా.. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించి మిగిలిన పిల్లర్లను తొలగించే పనులు చేపట్టారు. రెండు వారాలకు పైగా హైడ్రాలిక్ క్రేన్ల సహాయంతో పిల్లర్లను పగలగొట్టాలని ప్రయత్నించారు.. కానీ వీలు పడలేదు. అందుకే ఈ పిల్లర్లను కూల్చివేసేందుకు లిమిటెడ్ బ్లాస్టింగ్ పద్ధతిలో కూల్చివేతలు ప్రారంభించనున్నారు. ఈ విధానంలో ఒక్కో పిల్లర్‌ను తొలగిస్తూ పోవాలి.. దీనికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు.

1856 ప్రాంతంలో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎం (మద్రాస్ టు సదరన్ మరాఠా) రైల్వేలో విజయవాడ కూడా ఒక భాగంగా ఉండేది. 1893లో కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల పొడవున మీటర్ గేజ్‌ విధానంలో ఈ రైలు బ్రిడ్జిని నిర్మించి కృష్ణా ప్యాలెస్‌గా పేరు పెట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి స్టీల్ వాడకుండా రాతి బండలు, సున్నం సాయంతో నిర్మించారట. 1897లో ఈ రైల్వే బ్రిడ్జిని బ్రాడ్ గేజ్‌గా అప్‌గ్రేడ్ చేశారట. అనంతరం రైల్వేశాఖ ఈ బ్రిడ్జికి తూర్పు, పశ్చిమ వైపులా రైల్వే బ్రిడ్జిల నిర్మాణం చేసింది. ఆ తర్వాత ఈ కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జిని తొలగించగా కేవలం పిల్లర్లు మాత్రమే మిగిలాయి. అప్పటి నుంచి ఈ పిల్లర్లు అలాగే ఉండిపోయాయి. అయితే ప్రస్తుతం విజయవాడ గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టడంతో డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మించాలని ప్రణాళిక చేశారు. అందుకే ప్రస్తుతం చారిత్రక కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జికి సంబంధించి మిగిలిన పిల్లర్లను కూడా తొలగించాలని నిర్ణయించారు.

130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్లను తొలగించవద్దని గతంలో కొందరు రైల్వే అధికారులు కోరారు, లేఖలు రాశారు. దీంతో ఈ బ్రిడ్జి జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి కోసం కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి పిల్లర్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ బ్రిడ్జిని వదిలేసి అవతల కొత్త బ్రిడ్జి నిర్మించాలన్నా అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయట. అందుకే ఈ పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జిని నిర్మించాలని ప్లాన్ చేశారు. పిల్లర్లను తొలగించే ప్రక్రియను మొదలు పెట్టారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో తొలగింపు సాధ్యం కాలేదు. అందుకే లిమిటెడ్ బ్లాస్టింగ్ ద్వారా ఈ పిల్లర్లను కూల్చే పనులు ప్రారంభించనున్నారు. ఈ విధానంలో ముందు పిల్లర్లకు పగుళ్లు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో వీటిని తొలగించనున్నారు. దీంతో విజయవాడ చరిత్రలో ‘కృష్ణా ప్యాలెస్’ వంతెన జ్ఞాపకంగా మిగలబోతోంది.

  Last Updated: 23 Mar 2026, 02:01 PM IST