AP Minister: మంత్రి ఉషశ్రీ చరణ్‌ కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

  • Written By:
  • Updated On - November 17, 2022 / 02:13 PM IST

ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అప్పటి తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు 188 సెక్షన్‌ కింద ఆమెతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ కళ్యాణదుర్గం కోర్టులో జరిగింది. గైర్హాజరు కావడంతో ఆమెతో పాటు కేసులో ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీన మంత్రి ఉషశ్రీ చరణ్ తన అనుచరులను వెంటపెట్టుకొని తిరుమలకు వచ్చారు. అప్పుడు సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున టీటీడీ విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అయినప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ టీటీడీ అధికారులపై ఒత్తిడి చేసి 10 మంది అనుచరులకు సుప్రభాత టికెట్లు తీసుకోవడమే కాకుండా మరికొంత మంది అనుచరులకు బ్రేక్ దర్శనాలు కల్పించిన ఘటన కూడా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.