Site icon HashtagU Telugu

Amaravati Farmers : అమ‌రావ‌తి రైతులూ ప్లీజ్.!

Amaravati

Amaravati

హైకోర్టు తీర్పు మేర‌కు ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ల‌కు అమ‌రావ‌తి రైతుల‌ను సీఆర్డీయే ఆహ్వానిస్తోంది. కానీ, రిజిస్ట్రేష‌న్ కోసం రైతులు ఉత్సాహంగా ముందుకు రావ‌డంలేదు. నెలాఖ‌రులోగా ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని నోటీసులు ఇవ్వ‌డంతో పాటు ఫోన్ల ద్వారా రైతుల‌ను బ‌తిమ‌లాడుకుంటోంది. గత ప్రభుత్వం రైతుల నుంచి 34,385 ఎకరాలు సేకరించింది. ఒప్పందం ప్రకారం నివాస, వాణిజ్య తరహా ప్లాట్లను అభివృద్ధి చేసి తిరిగివ్వాల్సి ఉంది. దాని ప్రకారం గత ప్రభుత్వం ఉన్నప్పుడే 40,378 ప్లాట్లను రిజిస్టర్ చేసింది. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

దీనిపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు కదిలింది. మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రకియకు మార్చి నెలాఖరు వరకు గడువు విధించారు. అప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారి కోసం మరోసారి గడువును పొడిగించింది. ప్లాట్లను రిజిస్టర్ చేసుకునేందుకు రావాలంటూ అమరావతి రైతులకు సీఆర్డీఏ ఆహ్వానం పలికింది. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, రైతులు వెంటనే స్పందించి తమ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్న రైతులకు నోటీసులు పంపుతున్నారు.

ఏపీ సర్కారు మూడు రాజధానులకు మొగ్గుచూపుతుండడంతో అమరావతి రైతులు ఈ రిజిస్ట్రేషన్లపై ఏమంత ఆసక్తి చూపడంలేదు. అమరావతిలో ప్రస్తుతం భూముల పరిస్థితిపై తాము లేవనెత్తిన అభ్యంతరాలను సీఆర్డీఏ పట్టించుకోవడంలేదన్న అసంతృప్తి రైతుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది. రిజిస్టేష‌న్లు ముగిసిన త‌రువాత మిగిలిన భూమిని ప్ర‌భుత్వం త‌న‌ఖా పెడుతుంద‌న్న ఆందోళ‌న కూడా ఉంది. అప్పుల కోసం రాజ‌ధాని భూముల‌ను త‌న‌ఖా పెట్ట‌డానికి క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని కొంద‌రు రైతులు భావిస్తున్నారు. అందుకే, రిజిస్ట్రేష‌న్ల‌కు చాలా మంది దూరంగా ఉన్నారు.