MLA Roja : ప్రసంగిద్దామంటే జనమే లేరాయే! మంత్రి రోజాకు చేదు అనుభవం

మంత్రి రోజా ఎక్కడుంటే అక్కడ సందడే. తాను మాట్లాడుతూ అందరినీ మాట్లాడేలా చేస్తారు

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 05:48 PM IST

మంత్రి రోజా ఎక్కడుంటే అక్కడ సందడే. తాను మాట్లాడుతూ అందరినీ మాట్లాడేలా చేస్తారు. ఇక ఆమె ప్రసంగం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడతారు. అందుకే ప్రతిపక్షాలు కూడా ఆచితూచి స్పందిస్తాయి. అలాంటి మంత్రి రోజా ఇప్పుడు ప్రసంగిద్దామంటే జనమే లేకుండా పోయారు. ఆత్మకూరు ఉపఎన్నిక ప్రచారంలో చోటుచేసుకున్న ఘటన ఇది.

మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మికంగా మరణించడంతో ఆ నియోజవర్గానికి ఉపఎన్నికను నిర్వహిస్తున్నారు. సంప్రదాయాన్ని అనుసరించి అక్కడ టీడీపీ పోటీ చేయలేదు. అయినా సరే ఇతర పార్టీలు పోటీలో ఉండడంతో వైసీపీ అభ్యర్థిని గెలిపించేలా, అత్యధిక మెజార్టీని తెచ్చేలా మంత్రులు, ఇతర నేతలు అక్కడ ప్రచారం చేస్తున్నారు. మంత్రి రోజా కూడా అదే క్రమంలో అక్కడ ప్రచారం చేయాలనుకున్నారు.

మంత్రి రోజా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని తెలిస్తే.. పార్టీ నాయకులు జనాన్ని సమీకరించాలి. లేదా రోజా సినీతార కాబట్టి ఆవిడను చూడడానికి జనమైనా రావాలి. మరి ఏం జరిగిందో ఏమో కాని.. రోజా ప్రచారానికి వెళ్లినా సరే.. జనం మాత్రం కనిపించలేదు. రోడ్ షోలు చేస్తే.. అలా అయినా కొంతమంది గుమిగూడుతారు అనుకున్నారు. అయినా సరే ఫలితం లేకపోయింది. దీంతో రోడ్ షోలు కూడా వెలవెలబోయాయి. కొన్ని చోట్ల జనం లేకపోయినా సరే రోజా ప్రసంగించారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అలా చేయలేకపోయారో ఏమో.. ప్రసంగించకుండానే వెనుదిరిగారు.

ఈమధ్య వైసీపీ సభలకు జనం సంఖ్య తగ్గుతోందని విశ్లేషకులు అంటున్నారు. దానికి బదులుగా టీడీపీ సభలకు జనం పోటెత్తుతున్నారు. ముందస్తు ఊహాగానాలు వస్తున్న వేళ రాజకీయాల్లో ఇది ఏ మార్పునకు నాంది పలుకుతుందో చూడాలి.