అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండవ రోజు సీఐడీ విచారణ ముగిసింది. వాస్తవానికి హైకోర్టు ఒక రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు రెండో రోజు కూడా రావాలని కోరగా లోకేష్ విచారణకు వెళ్లారు. తనను హైకోర్టు ఒక్కరోజే హాజరవమని చెప్పిందని.. సీఐడీ అడిగినందుకు రెండోరోజు హాజరయ్యానని లోకేష్ తెలిపారు. రెండో రోజు కూడా తనను సుమారు ఆరు గంటలపాటు ప్రశ్నించారన్నారు. ఈ కేసులో కొత్తగా ఎలాంటి ఆధారాలు చూపలేదని.. ఇవాళ 45 ప్రశ్నలు అడిగారని తెలిపారు. వాటిలో ఒకటి రెండు తప్ప అన్నీ నిన్నటి ప్రశ్నలేనని లోకేష్ తెలిపారు. తన శాఖకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని.. దానిపై తనకు అవగాహన లేదని చెప్పానని లోకేష్ వెల్లడించారు. తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్ పేపర్లు ముందు పెట్టి ప్రశ్నలు అడిగారని.. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటామని లోకేష్ తెలిపారు. భువనేశ్వరి డాక్యుమెంట్స్ ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్లో ఇద్దరు రెడ్లపై FIR ఎందుకు లేదని ప్రశ్నించారు. సంతకాలు పెట్టిన ఇద్దరిని FIRలో ఎందుకు చేర్చలేదని.. ప్రేమ్ చంద్రారెడ్డి, అజేయ కల్లంను ఎందుకు విచారించట్లేదని లోకేష్ ప్రశ్నించారు. రెండు రోజుల పాటు తన సమయం వృథా చేశారని లోకేష్ మండిపడ్డారు. సీఐడీ విచారణ అనంతరం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే మరోసారి సీఐడీ విచారణకు రమ్మంటే నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
Also Read: Telangana: తెలంగాణాలో బీజేపీ గాలి వీస్తుంది: బండి