Nara Bhuvaneshwari : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సుయాత్ర షెడ్యూల్పై క్లారిటీ వచ్చింది. ‘నిజం గెలవాలి’ పేరుతో ఆమె నిర్వహించే బస్సు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనే వివరాలను టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 25న ఉదయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లి నుంచి ‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ యాత్ర కోసం సోమవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారని చెప్పారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం తిరుపతిలో పర్యటించి తిరుపతిలోనే బస చేస్తారన్నారు. బస్సు యాత్రలో భాగంగా మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి తిరుపతి జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై మరణించిన టీడీపీ నేత చిన్న స్వామి నాయుడు కుటుంబాన్ని నేండ్రగుంటకు వెళ్లి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పరామర్శిస్తారని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీవాసులతో ఆమె సహపంక్తి భోజనం చేస్తారన్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై భువనేశ్వరి ప్రసంగిస్తారని వెల్లడించారు. తిరుపతిలోనూ నారా భువనేశ్వరి పర్యటిస్తారని అమర్ నాథ్ రెడ్డి వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు పోలీసు కేసులను ఎదుర్కొంటున్న జనసేన, టీడీపీ కార్యకర్తలను ఈనెల 26న భువనేశ్వరి పరామర్శిస్తారని తెలిపారు.