ఆస్తి కోసం కన్న తల్లిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చురు మండలంలో చోటుచేసుకుంది. పర్చూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మద్దిన పేరమ్మ ఇంటి వద్ద ఉండగా.. సాయంత్రం సమయంలో ఆమె చిన్న కుమారుడు అంజయ్య వచ్చి తన పేరు మీద ఉన్న రెండెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలని పట్టుబట్టాడు. కుమారుడి పేరు మీద భూమి రాసేందుకు పేరమ్మ నిరాకరించింది. దీంతో పాటు తన వద్ద అప్పుగా తీసుకున్న 4 లక్షలు తిరిగి ఇవ్వాలనిపేరమ్మ కుమారుడిని కోరింది. దీంతో అంజయ్య తన తల్లిని హత్య చేయాలనే ఉద్దేశంతో ఆమెతో గొడవకు దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో ఆమెను పొడిచి పారిపోయాడు. పేరమ్మ అరుపులు విన్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పర్చూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎన్సీ ప్రసాద్ తెలిపారు. నిందితుడు అంజయ్యను పర్చూరులోని “వై” జంక్షన్లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.