ఏపీలో సంకల్పసిద్ధి పేరుతో జనాలకు కుచ్చటోపీ పెట్టిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధం ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ కేసులో తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. తనపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని… ఆధారాలు లేకుండా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ డీజీపీని కలిశారు. సంకల్పసిద్ది కేసుపై విచారణ చేయించాలని ఆయన డీజీపీని కోరారు. తనపై సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఆయన.. సంకల్పసిద్ధి సంస్థతో నాకు, కొడాలి నానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సంకల్ప సిద్ధి వాళ్లు ఎవరూ తనకు తెలియదని.. ఈ కేసులో తనపై ఏ ఆధారం ఉన్నా శిక్షకు సిద్ధమన్నారు. టీడీపీ నేతలు పట్టాభి, బచ్చులఅర్జునుడుపై ఎమ్మెల్యే వంశీ డీజీపికి ఫిర్యాదు చేశానని తెలిపారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఆధారాలు చూపించాలని.. కేసుపై అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానని వల్లభనేని వంశీ తెలిపారు.