నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘సాస్కీ’ పథకం ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్లు) సిద్ధం చేస్తున్నామని, తద్వారా కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న నాలుగు క్యాంపస్లకు అవసరమైన నిధుల వివరాలను మంత్రి సభకు తెలియజేశారు. నూజివీడు క్యాంపస్లో పనులు పూర్తి చేయడానికి రూ.60 కోట్లు, అరకు వ్యాలీలో నిర్మాణాలకు రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. అదేవిధంగా, ఒంగోలు క్యాంపస్కు రెండు దశల్లో కలిపి రూ.600 కోట్లు, శ్రీకాకుళం క్యాంపస్ పనులు పూర్తి చేయడానికి రూ.300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం శాశ్వత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలో తాత్కాలిక అకాడమీల కోసం వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జిల్లాలో ట్రిపుల్ ఐటీ చదివే విద్యార్థులు అక్కడే తమ కోర్సును పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని లోకేశ్ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి, శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేసి, విద్యార్థులు చేరిన క్యాంపస్లోనే చదువు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో, పుట్టపర్తిలో కొత్త ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసే అవకాశంపై ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి, తగిన పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన సభకు హామీ ఇచ్చారు.
