President tour:రాష్ట్ర‌ప‌తి ఏపీ టూర్!సీఎం స్థానంలో మంత్రి అమ‌ర్నాథ్ !

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము విశాఖ ప‌ర్య‌ట‌న‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న బ‌దులుగా మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆమెకు స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 06:04 PM IST

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము విశాఖ ప‌ర్య‌ట‌న‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న బ‌దులుగా మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆమెకు స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. రాష్ట్రపతి కార్య్రమాల్లో జ‌గ‌న్ కు బదులుగా ప్రభుత్వ ప్రతినిధిగా అమ‌ర్నాథ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఆ మేర‌కు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి టూర్ సంద‌ర్భంగా మంత్రి అమర్నాధ్ హోదాను పెంచుతూ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా ఖరారు చేసారు. తొలి సారి మంత్రి అయిన అమర్నాధ్ కు అరుదైన అవకాశం ల‌భించ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యమంత్రి విజయవాడ కార్య‌క్ర‌మాల‌కు వ‌ర‌కు ప‌రిమితం కావడంతో రాష్ట్ర‌ప‌తి విశాఖ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బ‌దులుగా మంత్రి అమర్నాధ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు. రాష్ట్రపతి విశాఖ టూర్ మొత్తం మంత్రి అమర్నాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలోనూ మంత్రి పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అమర్నాధ్ కు అధికారికగా `మినిస్టర్ ఇన్ వెయిటింగ్` హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.షెడ్యూల్ ప్ర‌కారం రాష్ట్ర‌ప‌తి ముర్ము రెండు రోజుల ఏపీ పర్యటన కోసం 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఆమె ఢిల్లీలో బయలుదేరి ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి హజరవుతారు. ఏపీ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్ రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్మును సన్మానిస్తారు. అనంతరం గౌరవార్థం గవర్నర్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. సాయంత్రం విశాఖలో జరిగే నేవీడే ఉత్సవాలకు.. రక్షణ దళాల సుప్రీం కమాండర్‌గా ముఖ్య అతిథిగా హాజరై, విన్యాసాలను తిలకిస్తారు.

విశాఖ వేదికగా రాష్ట్రంలో రక్షణ- జాతీయ రహదారులు, కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏయిర్ రేంజ్ వ‌ర్చువ‌ల్ గా ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ స్వగ్రామం క్రిష్ణా జిల్లా నిమ్మకూరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తారు. రాష్ట్రపతి ప్రారంభించే వాటిలో రాయచోటి – అంగల్లు జాతీయ రహదారి సెక్షన్ తో పాటుగా కర్నూలు నగరంలో ఆరు లేన్లుగా విస్తరించిన రోడ్లు ఉన్నాయి. మదిగుబ్బ- పుట్టపర్తి హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీట‌న్నింటిపైన‌ ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. విశాఖ లో కార్యక్రమాలు పూర్తయిన తరువాత అక్కడి నుంచి అదే రోజు రాత్రికి తిరుపతి చేరుకుంటారు. మ‌రుస‌టి రోజు(5వ తేదీ) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడి గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో భేటీ అవుతారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం బయలుదేరి నేరుగా ఢిల్లీకి వెళ్తారు.