Praja Rajyam party: ప్రజారాజ్యం … మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 లో జరిగిన 294 అసెంబ్లీ సీట్లకు గానూ పీఆర్పీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అయితే కేవలం అని కొట్టిపారేయలేం. ఎందుకంటే కాంగ్రెస్, టీడీపీ లాంటి బలమైన పార్టీల మధ్య తొలి ఎన్నికల్లోనే 18 సీట్లను గెలుచుకోవడం గొప్ప విషయమే. అయితే అప్పుడున్న చిరంజీవి ఇమేజ్ కి సీఎం పీఠం ఖాయమన్నారు. దివంగత ఎన్టీఆర్ తర్వాత ఓ సినీ నటుడు పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగడం ఇది రెండవ సారి. అయితే పార్టీ ఓడిపోవడంతో చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చిరు ఆ రోజు పీఆర్పీని విలీనం చేసి ఉండకపోతే ఇప్పుడు ఏపీలో చక్రం తిప్పి ఉండేది. కానీ పార్టీ అనంతరం అనేక విమర్శలు ఎదుర్కొన్నారు చిరంజీవి. ఎమ్మెల్యేలను గాలికొదిలేశాడని. రాజకీయ లబ్ది కోసమే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే అప్పుడు పీఆర్పీ కాంగ్రెస్ లో విలీననానికి కారణం ఎవరో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు కాకినాడ రూరల్లో మహాకూటమి అభ్యర్థి పట్నం వెంకటేశ్వరరావు తరపున పవన్ ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కన్నబాబుతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. 2008లో నేను పీఆర్పీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడిని. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో ఉండాలనే నిబద్ధతతో జీవితాంతం సమాజ సేవకే అంకితం కావాలన్నదే మా లక్ష్యం అని పవన్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join
కన్నబాబు అప్పట్లో పీఆర్పీ కార్యాలయానికి చెడిపోయిన స్కూటర్పై వచ్చేవాడు. కానీ ఇప్పుడాయన చాలా ఎత్తుకు ఎదిగాడని అన్నారు పవన్. రాజకీయ రంగంలో వ్యక్తులు ఎదగడం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా, ఇతరులను మోసం చేసి ఉన్నత స్థాయికి చేరుకోవడం అభ్యంతరకరం అని ఆయన అన్నారు. కాంగ్రెస్లో పీఆర్పీ రద్దుకు ప్రధాన కారణం కన్నబాబు అని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. కాగా కన్నబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ రూరల్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.
Also Read: Pawan Kalyan : జగన్ ను గద్దె దించేవరకు మీరు ఎన్నిహారతులు తీసినా ప్రయోజనం లేదు