NAAC : కనీస ప్రమాణాలు లేకుండానే న్యాక్ రేటింగ్ కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించిన కేఎల్ యూనివర్సిటీ (KL University) అధికారులతో పాటు న్యాక్ (NAAC) పర్యవేక్షక బృందం సభ్యులను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (KLEF) అధికారులతో పాటు న్యాక్ సభ్యులను కలిపి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
సాధారణంగా న్యాక్ అక్రెడిటేషన్ ప్రక్రియ అత్యంత గణనీయమైనదిగా భావించబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలు న్యాక్ రేటింగ్ను తమ ప్రతిష్ఠగా భావిస్తాయి. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయనే సంకేతంగా న్యాక్ రేటింగ్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ వ్యవస్థలో అవినీతి ఉందని గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చినా, ఈ స్థాయిలో పెద్ద స్కాం బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఎ++ రేటింగ్ కోసం ముడుపుల వ్యవహారం – సీబీఐ దర్యాప్తులో వెల్లడి
న్యాక్ అక్రెడిటేషన్ ‘ఎ++’ రేటింగ్ పొందేందుకు కేఎల్ యూనివర్సిటీ అధికారులు న్యాక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులకు ముడుపులు అందించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో కేఎల్ఈఎఫ్ ఉన్నతాధికారులతో పాటు న్యాక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. కేఎల్ఈఎఫ్ ఆఫీస్ బేరర్లు నేరుగా లంచాలు ఇచ్చారని, దీనికి సంబంధించి పలు ఆర్థిక లావాదేవీలను గుర్తించామని సీబీఐ వెల్లడించింది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలము, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమబుద్ధ నగర్, న్యూఢిల్లీ వంటి నగరాల్లో జరిగిన ఈ దాడుల్లో అనేక కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
దాడుల్లో స్వాధీనం చేసుకున్న కీలక ఆధారాలు
సీబీఐ అధికారులు ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ డివైస్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 37 లక్షల నగదు, 6 లెనోవో ల్యాప్టాప్లు, ఒక ఐఫోన్ 16 ప్రో మొబైల్ ఫోన్, ఒక బంగారు నాణెం, అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ బ్యాగులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
అరెస్ట్ అయిన కేఎల్ఈఎఫ్, న్యాక్ సభ్యులు
ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కేఎల్ఈఎఫ్కు చెందిన ముఖ్యులే ఉండటం విశేషం. వీరిలో కేఎల్ఈఎఫ్ వైస్ చాన్స్లర్ జీపీ సారథి వర్మ, కేఎల్ఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, కేఎల్యూ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ. రామకృష్ణ, వీరితో పాటు ఆరుగురు న్యాక్ పర్యవేక్షణ బృందం సభ్యులు కూడా అరెస్ట్ అయ్యారు.
అంతేకాకుండా, న్యాక్ సీనియర్ అధికారులు, కేఎల్ఈఎఫ్కు చెందిన మరో 14 మందిపై FIR నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు అనంతరం మరిన్ని అరెస్టులు కూడా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
Champions Trophy: ప్రాక్టీస్ మ్యాచ్లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనున్న భారత్
న్యాక్ అక్రెడిటేషన్పై నమ్మకాన్ని దెబ్బతీసిన స్కాం
ఈ స్కాం వెలుగులోకి రావడం వల్ల న్యాక్ అక్రెడిటేషన్ విధానం పట్ల తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు న్యాక్ రేటింగ్ను తమ విశ్వసనీయతకు నిదర్శనంగా ఉపయోగించుకుంటాయి. అయితే, లంచాల వ్యవహారం ద్వారా రేటింగ్ను పొందవచ్చని తేలిపోవడం విద్యా వ్యవస్థ పరువు పోయేలా చేస్తోంది.
వాస్తవానికి, న్యాక్ ద్వారా ఇచ్చే అక్రెడిటేషన్లో పారదర్శకత ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు భావిస్తాయి. కానీ, ఈ ఘటన వల్ల ఇది పూర్తిగా తారుమారైన పరిస్థితి. అవినీతిపరుల చేతిలో అర్హత లేని సంస్థలకు అత్యున్నత రేటింగ్ ఇవ్వబడుతోందన్న ఆరోపణలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి.
సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది
సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు కేఎల్ఈఎఫ్ నాయాకులు, న్యాక్ బృందం సభ్యులు అరెస్టైనప్పటికీ, ఈ వ్యవహారంలో మరింత లోతుగా పరిశీలన అవసరమని అధికారులు చెబుతున్నారు.
కేఎల్ యూనివర్సిటీకి ‘ఎ++’ రేటింగ్ ఎలా లభించింది? ఈ స్కాం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇలాంటి మరెన్ని విద్యాసంస్థలు ఇదే విధంగా అక్రమ మార్గాల్లో న్యాక్ రేటింగ్ పొందాయి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సీబీఐ దర్యాప్తు పూర్తి కావాల్సి ఉంది. ఇలాంటి ఘటనల వల్ల విద్యా వ్యవస్థ నశించిపోకుండా ఉండాలంటే, న్యాక్ అక్రెడిటేషన్ విధానంలో సంస్కరణలు రావాల్సిందే.
Indias Aid 2025 : కేంద్ర బడ్జెట్.. భారత్ ఆర్థికసాయం పొందనున్న దేశాలివే