Site icon HashtagU Telugu

Liquor Scam : ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం.. మరొకరు అరెస్ట్

Key development in AP liquor scam case.. Another person arrested

Key development in AP liquor scam case.. Another person arrested

Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో సిట్ అధికారులు మరో కీలక నిందితుడైన వరుణ్‌ను అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న వరుణ్‌ను ఇప్పటికే విజయవాడ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. పోలీసులు అతడిని పలుమార్లు పిలిపించినా హాజరుకాలేదు. దీంతో అతనిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరుణ్ లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A1) కు దగ్గరగా ఉన్న వరుణ్, కలెక్షన్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు.

Read Also: Israel War : 21 నెలలుగా యుద్ధం.. 60 వేల మంది మృతి

స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే కొన్ని ప్రభావశీలుల సహాయంతో వరుణ్ విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. అయితే గట్టి సమాచారం ఆధారంగా అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతడిని పట్టుకున్నారు. సిట్ అధికారులు వరుణ్‌ను విచారించగా పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. వరుణ్ తెలిపిన సమాచారం మేరకు బుధవారం (జూలై 30) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. స్కాంలో మరో నిందితుడు చాణక్య (A12) సహాయంతో వరుణ్ రూ.11 కోట్లను 12 అట్టపెట్టల్లో దాచి ఉంచినట్లు అంగీకరించాడు. ఈ డబ్బును 2024 జూన్‌లో దాచినట్లు గుర్తించారని అధికారులు తెలిపారు.

అదే సమయంలో శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్‌హౌస్‌లో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ భారీగా అక్రమ మద్యం నిల్వలు బయటపడ్డాయి. ఈ డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం సరఫరాకు సంబంధించిన వివరాలను కూడా వరుణ్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుణ్‌ను అరెస్ట్ చేయడం ద్వారా ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఇవాళ, రేపు మరిన్ని ప్రాంతాల్లో సోదాలు కొనసాగించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఈ స్కామ్ రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా అధికార పక్షానికి చెందిన నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను శాశ్వతంగా మార్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Betting apps case : ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్‌రాజ్‌