అధికారంలోకి రావడమా? పార్టీని కాపాడుకోవడమా? ఈ రెంటింటినీ ఒకేసారి సాధించుకోవడం సాధ్యామా? అనేది తెలుగుదేశం ముందున్న పెద్ద సవాల్. అధికారంలోకి వస్తే ఆటోమాటిక్ గా పార్టీ నిలబడిపోతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ, అధికారంలోకి రావడం కంటే పార్టీని నిలుపుకునే ప్రక్రియ వేరని టీడీపీలోని సీనియర్ల మనోభావం. అటు అధికారం ఇటు పార్టీని నిలుపుకోవడం కోసం త్యాగాలు చేయాల్సి ఉంటుందని కోర్ టీమ్ వేస్తోన్న అంచనా. ఇంతకూ టీడీపీ ఈ మూడు అంశాలపై ఎందుకు అంతగా తర్జనభర్జన పడుతుందంటే కారణం ఏపీలోని జనసేన అడుగులు.
అధికారంలోకి డామ్ షూర్ గా రావాలంటే జనసేనతో పొత్తు అవసరమని టీడీపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. ఆ దిశగా పార్టీని అడుగుల వేయిస్తూ ప్రయత్నం చేస్తున్నారు. అందుకు, వన్ సైడ్ లవ్ వ్యాఖ్యల నుంచి ఇటీవల విజయవాడ కేంద్రంగా పవన్ ఉండే హోటల్ కు చంద్రబాబు వెళ్లిన సంఘటనలను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆ సంఘటనల కారణంగా రాష్ట్రంలో జనసేన బలపడినట్టు ఫోకస్ అయింది. అదే ఇప్పుడు టీడీపీని కలవరపరుస్తోంది. అనివార్యంగా పొత్తు పెట్టువాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు లెక్కిస్తున్నారు. అధికారం కోసం పొత్తు పెట్టుకుంటే పార్టీ పరంగా టీడీపీకి నష్టమని సీనియర్లు అంచనా వేస్తున్నారు. దానికి 2009లో ఏర్పడిన మహాకూటమి ఎపిసోడ్ ను ఉదహరిస్తున్నారు.
Also Read: YCP Leaders Comments: జనసేనానిపై విమర్శలు.. పవన్ ఓ రాజకీయ అజ్ఞాని..!
తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం ఏపీలోని జనసేన మాదిరిగా ఆనాడు తెలంగాణలో టీఆర్ఎస్ రాజకీయం ఇంచుమించు ఉండేది. కేవలం పొత్తులతోనే టీఆర్ ఎస్ బలపడింది. తొలుత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఆ తరువాత 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత క్రమంగా బలపడుతూ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలహీనపరుస్తూ వచ్చింది. సరిగ్గా ఈ పరిస్థితిని ఏపీలో అన్వయించుకుంటూ ఒక వేళ పొత్తు పెట్టుకుంటే జనసేన అసెంబ్లీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదడానికి బీజం పడుతుంది. ఫలితంగా ఏపీ రాజకీయ చరిత్రలో ముక్కోణపు రాజకీయం స్థిరపడే అవకాశం ఉంది. ఆ పరిణామం భవిష్యత్ లో టీడీపీకి నష్టమని ఆ పార్టీలోని కొందరు సీనియర్ల అంచనా.
వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తే అధికారం వస్తే ఓకే, లేదంటే కనీసం బలమైన ప్రతిపక్షంగా టీడీపీ అసెంబ్లీలో ఉంటుంది. నామమాత్రంగా మాత్రమే జనసేన మిగిలిపోతుంది. ఆ పార్టీకి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపు లేదు. గత ఎన్నికల్లో వచ్చిన 5శాతం ఓటు బ్యాంకుకు మరో రెండు శాతం అదనంగా వచ్చినప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టే జనసేన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మినహా ఉండరని సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం కోసం జనసేనతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి నష్టం. అందుకే, లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు బస్సు యాత్రలు చేయడంతో పాటు క్యాడర్ ను బలంగా క్షేత్రస్థాయిలో మోహరించడం ద్వారా ఒంటరిగా అధికారంలోకి వచ్చే ప్లాన్ చేయాలని టీడీపీ కోర్ టీమ్ ఉవాచ. అందుకోసం కొన్ని త్యాగాలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇస్తోంది. ఇలాంటి సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నడుమ చంద్రబాబు ఏమి చేస్తారు? అనేది ఆసక్తికరం.
Also Read: JanaSena Chief Pawan Kalyan: పవన్ సంచలన వ్యాఖ్యలు.. వైఎస్సార్ వారికన్నా గొప్ప నాయకుడా..?