Janasena: నేడే జనసేన ఆవిర్భావ సభ.. సభ వేదికకు పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం..!

ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ సభలపై ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టడంతో జనసేన (Janasena) పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. పదవ వార్షికోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహించాలనుకున్న పార్టీకి పోలీసుల ఆంక్షలు ఇబ్బందిగా మారుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 08:55 AM IST

ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ సభలపై ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టడంతో జనసేన (Janasena) పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. పదవ వార్షికోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహించాలనుకున్న పార్టీకి పోలీసుల ఆంక్షలు ఇబ్బందిగా మారుతున్నాయి. అయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నేటి సమావేశంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు మరికొందరు కీలక నేతలు పాల్గొంటున్నారు. జనసేన పార్టీ 2014 మార్చి 14న ఏర్పాటై.. ఇప్పటికి 9 ఏళ్లు పూర్తి చేసుకుని.. పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా ఉంది. అందుకోసం పదో ఆవిర్భావ సభకు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. పోలీసుల ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని..సభ, పార్కింగ్ అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకున్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.

ఈ సభ జరిగే ప్రాంతంలోనే సభ నిర్వహించేందుకు రైతులు అనుమతి ఇచ్చారు. సభా ప్రాంగణంలో 10 గ్యాలరీలు, భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే కార్యకర్తలకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు పార్కింగ్‌కు ఒకవైపు ఏర్పాటు చేశారు. ఎండాకాలం కావడంతో వచ్చేవారికి మంచినీళ్లతో పాటు మజ్జిగ, పండ్లు కూడా ఇస్తారు. పెద్దఎత్తున వచ్చే కార్మికులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యం అందించేందుకు వైద్యులు, 8 అంబులెన్సులను కూడా సిద్ధం చేశారు.

Also Read: MLC Polling: ఓట్ల దందా!మ‌హిళకు 18 మంది భ‌ర్త‌లు,నో డిగ్రీ!

ఈ సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో మధ్యాహ్నం విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు సమావేశంలో పాల్గొంటారు. అప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా విజయవాడ-బందరు మధ్య అభిమానులు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇది కీలక సమయం. ఈ ఏడాదిలో పార్టీ పని తీరుపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీని యాక్టివ్ చేస్తున్నారు. కానీ.. కార్యకర్తల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన ఒంటరిగా వెళ్తుందా? టీడీపీతో కలిసి వెళ్తుందా? బీజేపీతో పొత్తు మాటేంటి? ఓట్లు చీలిపోనివ్వని పవన్ కళ్యాణ్.. దానికి ఏం చేయబోతున్నాడు? పార్టీని ఎలా విస్తరించాలనుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఏపీ రాజధానిపై పవన్ ప్లాన్ ఏంటి? యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రాభివృద్ధిపై జనసేన ఎజెండా ఏమిటి? ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు సమాధానం దొరుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.