ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ..ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లోకి జంప్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారేందుకు చూస్తున్నారు. కేవలం అధికార పార్టీ వైసీపీలోనే కాదు టీడీపీ , జనసేన లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైసీపీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు జనసేన , టీడీపీ లో చేరగా..ఇప్పుడు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం పార్టీ ని వీడేందుకు చూస్తున్నారు.
రీసెంట్ గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ (Jaleel Khan) విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇదే సీటుపై టీడీపీ (TDP) నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బేగ్ కూడా కర్చీఫ్ వేసి పెట్టారు. అయితే ఈ సీటు జనసేన పార్టీకి కేటాయించడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ క్రమంలో జలీల్ఖాన్ టికెట్ రాని చోట ఉండడం ఎందుకని..వైసీపీ (YCP) లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు
We’re now on WhatsApp. Click to Join.
బుధవారం ఉదయం వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిశారు. జలీల్ ఖాన్ విజయవాడలోని అయోధ్య రామిరెడ్డి కార్యాలయంలో భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమైందనే వార్తలొచ్చాయి. ఈ విషయం తెలియడంతో టీడీపీ నేత కేశినేని చిన్ని రంగంలోకి దిగారు.. నేరుగా జలీల్ఖాన్ దగ్గరకు వెళ్లి మంతనాలు జరిపారు. టీడీపీని వీడొద్దని.. పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నచ్చజెప్పారు. జలీల్ఖాన్ను పలువురు టీడీపీ మైనార్టీ నేతలు కూడా కలిసి బుజ్జగించారు. ఒకటి, రెండు రోజుల్లో చంద్రబాబును కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
కార్యకర్తల నుంచి ఒత్తిడి తట్టుకోలేకే వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశానని జలీల్ ఖాన్ అన్నారు. ‘నా టికెట్ విషయమై ఎన్నోసార్లు చంద్రబాబు, పవన్ను కలిశాను. కానీ వారు ఎటూ తేల్చడం లేదు. దీంతో కార్యకర్తలు నాపై ఒత్తిడి తెచ్చారు. అందుకే వైసీపీ ఎంపీని కలిశా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతా. ఏ పార్టీ నుంచి అనేది ఇప్పుడే చెప్పలేను’ అని ఆయన పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలు బట్టి టీడీపీ లో కొనసాగుతారా..? టైం చూసుకొని వైసీపీ లోకి జంప్ అవుతారా అనేది తెలియడం లేదు.
Read Also : Actor Vijay : విజయ్ పార్టీ ఫై PK కీలక వ్యాఖ్యలు